Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్.. రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్కు చేరింది. నాగాలాండ్తో జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 68 పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ 462/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. నాగాలాండ్ రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 206, 188 పరుగులకు ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లతో అదరగొట్టిన తనయ్ త్యాగరాజన్.. రెండో ఇన్నింగ్స్లోనూ మరో 6 వికెట్లు ఖాతాలో వేసుకోవడంతో.. ప్రత్యర్థి కనీస ప్రతిఘటన లేకుండానే వెనుదిరిగింది. ప్లేట్ గ్రూప్లో ఇప్పటి వరకు ఆడిన అన్నీ మ్యాచ్ల్లోనూ హైదరాబాద్ ఇన్నింగ్స్ విజయాలు సాధించడం విశేషం.
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్లో తుదిపోరుకు అర్హత సాధించిన హైదరాబాద్ జట్టును హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు అభినందించారు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ తిలక్ వర్మతో ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్.. మున్ముందు ఇలాంటి ప్రదర్శనలు కొనసాగించాలని ఆకాంక్షించారు.