ఇండియన్ సూపర్ లీగ్
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ జోరు కొనసాగుతున్నది. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి భిన్నమైన ప్రదర్శన కనబరుస్తున్న హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పోరులో హైదరాబాద్ 6-1 తేడాతో ఒడిశాను చిత్తు చేసింది. హెచ్ఎఫ్సీ తరఫున ఒగ్బాచే (39వ, 60వి నిమిషాల్లో) డబుల్ గోల్స్తో చెలరేగగా.. సైలాంగ్ (9), గార్సియా (54), జావియర్ సివెరియో (72), విక్టర్ (86) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఒడిశా తరఫున జునాన్ (16వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరగా.. 16 పాయింట్లతో ముంబై టాప్లో కొనసాగుతున్నది. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఒగ్బాచే (8) అగ్రస్థానంలో ఉన్నాడు.