కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లగా.. ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు క్వార్టర్స్లోనే పోరాటం ముగించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శుక్రవారం ప్రణయ్ 25-23, 22-20తో కెంటా సునెయామా (జపాన్)పై విజయం సాధించాడు. గంటపాటు హోరాహోరీగా సాగిన పోరులో ప్రణయ్ అద్వితీయ ఆటతో ఆకట్టుకున్నాడు. ఇటీవల భారత జట్టు థామస్ కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ప్రణయ్ శనివారం జరుగనున్న సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో తలపడనున్నాడు. మహిళల క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 13-21, 21-12, 12-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జూ యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. గత వారం మలేషియా సూపర్ సిరీస్లోనూ తై జూ చేతిలోనే ఓడిన తెలుగమ్మాయి.. మరోసారి పరాజయం వైపు నిలిచింది.