ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్. అందుకే దీని మీడియా హక్కుల కోసం బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ మీడియా హక్కులు (IPL Media Rights) ఏకంగా రూ.48,390 కోట్లు పలికాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక రెవెన్యూ సంపాదించే స్పోర్ట్స్ లీగుల్లో రెండో స్థానానికి ఐపీఎల్ చేరింది.
ఈ నేపథ్యంలోనే మీడియా హక్కుల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును ఎలా పంచుతామనే విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ వివరాలు తెలుపుతూ వరుసగా ట్వీట్లు చేశారు. ఈ లెక్కల ప్రకారం వచ్చిన డబ్బులో సగం మొత్తాన్ని ఐపీఎల్ ఒరిజినల్ ఎనిమిది జట్ల ఫ్రాంచైజీలకు అందిస్తారట.
అంటే ఒక్కో ఫ్రాంచైజీకి సుమారు రూ.3వేల కోట్లు అందుతుంది. కొత్తగా చేరిన రెండు జట్లకు ప్రస్తుతానికి ఏమీ దక్కదు. మిగతా సగం అంటే (IPL Media Rights) రూ.24,195 కోట్లను ఆటగాళ్లు, రాష్ట్ర అసోసియేషన్లకు అందిస్తామని జై షా తెలిపారు. బీసీసీఐ వర్గాల ప్రకారం, ఈ 24 వేల కోట్లలో 26 శాతాన్ని దేశవాళీ, అంతర్జాతీయ ఆటగాళ్లకు పంచుతారట.
మిగతా 74 శాతంలో ఒక నాలుగు శాతాన్ని స్టాఫ్ జీతాలకు ఉపయోగిస్తారని తెలుస్తోంది. మిగతా 70 శాతం మొత్తాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అసోసియేషన్లకు అందిస్తారని సమాచారం. ఈ లెక్కన మొత్తం రూ.6,290 కోట్లను దేశవాళీ, అంతర్జాతీయ ఆటగాళ్లకు అందిస్తారు. మిగతా రూ.16,936 కోట్లను బీసీసీఐ అనుబంధ రాష్ట్ర బోర్డులకు పంచుతారు.
Now, it’s time for our state associations, IPL Franchises to work together with the IPL to enhance the fan experience and ensure that our biggest stakeholder – ‘the cricket fan’ is well looked after and enjoys high quality cricket in world-class facilities.
— Jay Shah (@JayShah) June 14, 2022