భారత సీనియర్ సెలక్షన్ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొటేషన్ పాలసీ పేరిట ఆటగాళ్లకు సిరీస్ కు సిరీస్ మధ్యలో విశ్రాంతినివ్వడంపై బీసీసీఐ తీరును మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు ఎండగడుతున్నారు. ఏమంత క్రికెట్ ఆడారని వారికి విశ్రాంతినిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సిరీస్ ఆడగానే అలసిపోతే వాళ్లకు ఏం ఫిట్నెస్ ఉన్నట్టు..? అని బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, షమీ వంటి ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. పైన పేర్కొన్న వారిలో రిషభ్ పంత్ మినహా ఐపీఎల్ తర్వాత అందరూ విరామం తీసుకున్నవాళ్లే. ఈ గ్యాప్ లో వాళ్లు ఆడేది ఇంగ్లండ్ లో జరుగుతున్న సిరీస్ మాత్రమే.
తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘అసలు ఈ విరామం తీసుకుని ఆటగాళ్లు ఏం చేస్తారు..? మీకు ఎంత రెస్ట్ కావాలి..? గతంలో ఓ ఆటగాడు పామ్ కోల్పోయి బాగా ఆడకుంటే అతడికి విరామం ఇచ్చేవాళ్లు. సదరు క్రికెటర్లు తిరిగి దేశవాళీ క్రికెట్ లో నిరూపించుకుని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి..? ఇది ఆందోళనకరం..
నా అభిప్రాయం ప్రకారం.. ఎవరైనా ఆటగాడు పామ్ కోల్పోతే అతడు మెరుగవ్వడానికి మరిన్ని అవకాశాలివ్వాలి. బయోబబుల్స్ కారణంగా గడిచిన రెండేండ్లలో తీరిక లేని క్రికెట్ ఆడిన దాఖలాలు కూడా లేవు. గత రెండేండ్లలో కనీసం నాలుగు నెలలైనా విరామం దొరికింది కదా. ఇంకా రెస్ట్ ఎందుకు..?’ అని ప్రశ్నించాడు.