హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఐపీఎల్ 19 సీజన్ లీగ్ దశ ముగింపునకు వస్తున్న తరుణంలో మరో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. మెగా టోర్నీ లీగ్ దశకు సొంతగడ్డపై ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ చాంప్, బలమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును రైజర్స్ ఢీకొనట్టనుంది. ఈ పోరులోనూ నెగ్గి ఆర్సీబీ టాప్ ప్లేస్తో ప్లేఆఫ్స్ చేరుకోవాలని చూస్తోంది. ఆర్సీబీపై భారీ విజయంతో రెండో స్థానం అందుకొని నేరుగా క్వాలిఫయర్ -1 మ్యాచ్ ఆడాలని సన్రైజర్స్ భావిస్తోంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉండటం, బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారడం ఆర్సీబీకి పెద్ద ప్లస్ పాయింట్. ఈ మ్యాచ్లో గెలిచి టేబుల్ టాపర్గా లీగ్ దశను ముగించాలని ఆ టీమ్ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు, సొంత మైదానంలో ఆడుతుండటం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ సానుకూలాంశం.
ఈ లెక్కలు పక్కనబెడితే ఈ మ్యాచ్లో అందరి ఫోకస్ కింగ్ కోహ్లీపైనే ఉండనుంది. ఈ లెజెండరీ క్రికెటర్ హైదరాబాద్లో మ్యాచ్ ఆడి మూడేళ్లుఅవుతోంది. చివరగా 2023 ఐపీఎల్లో ఉప్పల్లో ఆడిన కోహ్లీ ఖతర్నాక్ సెంచరీతో విజృంభించి ఆర్సీబీని గెలిపించాడు. ఈ నేపథ్యంలో విరాట్ను ప్రత్యక్షంగా చూడాలని ఆశిస్తున్న భాగనగర అభిమానులు స్టేడియానికి పోటెత్తనున్నారు. సీఎస్కే మ్యాచ్ మాదిరిగా శుక్రవారం ఉప్పల్ స్టేడియం ఆర్సీబీ జెర్సీలతో ఆ జట్టు, కోహ్లీకి మద్దతుగా అభిమానులు చేసే నినాదాలతో హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో హైదరాబాద్లో ఇదే చివరి మ్యాచ్ కావడం, కోహ్లీ బరిలో ఉండటంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆన్లైన్ సేల్లో క్షణాల్లో అమ్ముడయ్యాయి. ఈ డిమాండ్ దృష్ట్యా బ్లాక్లో నాలుగైదు రెట్లకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది.