బెంగళూరు: ఎనిమిది నెలల వ్యవధిలో అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇది ముందస్తు ప్రణాళికలో భాగం కాదని.. అయినా జట్టులో ఎక్కువమంది సారథులను తయారు చేయడం మంచిదేనని పేర్కొన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టగా.. ఈ ఎనిమిది నెలల్లో కోహ్లీ, రోహిత్, ధవన్, రాహుల్, పంత్ వేర్వేరు సమయాల్లో టీమ్ఇండియా కెప్టెన్లుగా వ్యవహరించారు.
త్వరలో ఐర్లాండ్తో జరుగనున్న టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా సారధ్యం వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవిడ్ స్పందిస్తూ.. ‘ఇది సవాలుతో కూడుకున్న విషయం. గత ఎనిమిది నెలల్లో ఆరుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇది ముందస్తు ప్రణాళికలో భాగం కాకపోయినా.. కరోనా, గాయాలు, ఆడుతున్న మ్యాచ్ల సంఖ్య వల్ల ఇలా జరిగింది. ఎక్కువ మంది ఆటగాళ్లతో కలిసి పనిచేయడం సరదాగా ఉంది. కొత్తవాళ్లకు నాయకత్వం వహించే అవకాశాలు లభించాయి. జట్టులో మరింత మంది నాయకులను తయారు చేసే చాన్స్ దక్కింది’ అని అన్నాడు.
పంత్ చాలా ముఖ్యం..
తాజా సిరీస్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన కెప్టెన్ పంత్ను హెడ్ కోచ్ ద్రవిడ్ వెనకేసుకొచ్చాడు. భవిష్యత్తు ప్రణాళికల్లో పంత్ చాలా కీలకమని పేర్కొన్నాడు. ‘సఫారీలతో సిరీస్లో పంత్ ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. కానీ అతడు మా ప్రణాళికల్లో భాగమైన ప్రధాన ఆటగాడు. రెండు, మూడు మ్యాచ్ల ఆధారంగా ఆటగాళ్లపై ఒక అంచనాకు రాకూడదు. మధ్య ఓవర్లలో ధాటిగా ఆడే క్రమంలో కొన్నిసార్లు తప్పుడు షాట్లకు అతడు వికెట్ సమర్పించుకున్నాడు. సిరీస్లో 0-2తో వెనుకంజలో పడ్డ తర్వాత తిరిగి పుంజుకోవడం ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. ఐపీఎల్ కారణంగా నాణ్యమైన పేసర్లు వెలుగులోకి వస్తున్నారని ‘ది వాల్’ చెప్పాడు.