Wanindu Hasaranga : శ్రీలంక జట్టు స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ(Wanindu Hasaranga) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్(Test Cricket)కు వీడ్కోలు పలికాడు. ఇకనుంచి వన్డే, టీ20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగనున్నట్టు తెలిపాడు. ఈ లెగ్స్పిన్నర్ నిర్ణయాన్ని లంక క్రికెట్ బోర్డు అంగీకరించింది. ‘హసరంగ నిర్ణయాన్ని ఒప్పుకుంటున్నాం. వన్డే ఫార్మాట్లో ముఖ్యంగా త్వరలో జరగనున్న వన్డే వరల్డ్ కప్లో అతను కీలకమవుతాడనే నమ్మకం మాకుంది’ అని శ్రీలంక క్రికెట్ సీఈఓ అష్లే డిసిల్వా(Ashley De Silva) ఓ ప్రకటనలో వెల్లడించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో హసరంగకు గొప్ప రికార్డు ఉంది. మూడు సెంచరీలతో పాటు 102 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తన సంచలన బౌలింగ్తో జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే.. టెస్టుల్లో కంటే వన్డేలు, టీ20ల్లోనే హసరంగ రికార్డు మెరుగ్గా ఉంది. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ బౌలర్ ఇప్పటివరకు ఆడింది నాలుగు టెస్టులే. మరో విషయం ఏంటంటే..? కేవలం నాలుగు వికెట్లు తీశాడంతే. హసరంగ నిరుడు ఏప్రిల్లో బంగ్లాదేశ్పై చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకూ లంక తరఫున 48 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడాడు.
వనిందు హసరంగ
గత నెలలో జింబాబ్వేలో ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్(World Cup Qualifiers 2023) పోటీల్లో హసరంగ విజృంభించాడు. వరుసగా మూడు మ్యాచుల్లో 5 వికెట్ల ప్రదర్శన చేసి రికార్డు సృష్టించాడు. దాంతో, వరల్డ్ కప్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్గా పాక్ లెజెండ్ వకార్ యూనిస్(Waqar Younis) సరసన నిలిచాడు. అతడి సంచలన ప్రదర్శనతో లంక అవలీలగా ఫైనల్ చేరింది. వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించడమే కాకుండా క్వాలిఫైయర్స్ చాంపియన్గా అవతరించింది. హసరంగ ఐపీఎల్తో పాటు పలు లీగ్స్లో ఆడుతున్నాడు కూడా.