Hardik Pandya | టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మడిమకు గాయం కావడంతో తర్వాత మ్యాచ్లో భారత్ కు అతడి సేవలు అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడ్డ హార్ధిక్.. పూణే నుంచి నేరుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్లాడు. గాయం తీవ్రత దృష్ట్యా బీసీసీఐ.. అతడిని ఎన్సీఏకి పంపించింది. ఎన్సీఏలో పాండ్యాను ఇంగ్లాండ్కు చెందిన వైద్య నిపుణుడు పర్యవేక్షించనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
హార్ధిక్ గాయానికి సంబంధించి బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘పాండ్యా పూణే నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకున్నాడు. ఎన్సీఏలో మెడికల్ టీమ్ పర్యవేక్షణలో పాండ్యా స్కానింగ్, చికిత్స ప్రక్రియ జరుగుతాయి. అయితే అతడు ఈనెల 22న ధర్మశాల వేదికగా న్యూజిలాండ్తో జరుగబోయే మ్యాచ్కు మాత్రం అందుబాటులో ఉండేది అనుమానమే. కానీ ఇంగ్లాండ్తో అక్టోబర్ 29న లక్నో వేదికగా జరుగబోయే మ్యాచ్ నాటికి ఫిట్ అవుతాడు’ అని తెలిపాడు.
బంగ్లాదేశ్తో మ్యాచ్లో బౌలింగ్ చేసిన హార్ధిక్.. లిటన్ దాస్ కొట్టిన బంతిని ఆపబోయే క్రమంలో గాయపడ్డాడు. అతడి ఎడమ మడిమకు గాయమైంది. దీంతో కొద్దిసేపు అతడు మైదానాన్ని వీడాడు. హార్ధిక్ దూరమైతే కివీస్తో మ్యాచ్లో అతడి స్థానంలో తుది జట్టులో ఎవరు ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.