ఐపీఎల్లో అద్భుతంగా రాణించి గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి ప్రయత్నంలోనే టైటిల్ సాధించిన హార్దిక్ పాండ్యా గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన అతను భారత జట్టులో కూడా పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేశారు.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ వరకు హార్దిక్ను వన్డేలు ఆడించకూడదని, దాని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఆల్రౌండర్గా అయినా లేదంటే బ్యాటర్గా అయినా సరే హార్దిక్ జట్టుకు చాలా అవసరం అని చెప్పిన రవిశాస్త్రి.. అతన్ని మాత్రం టీ20లకే పరిమితం చేస్తే బాగుంటుందని అన్నాడు.
వన్డేలు ఆడించడం వల్ల హార్దిక్ ఆటకు ఎలాంటి ఉపయోగం ఉండదని, గట్టిగా మాట్లాడితే నష్టమే జరుగుతుందని చెప్పాడు. అలాగే అవసరం అనుకుంటే హార్దిక్ను నాలుగో స్థానంలో కూడా బ్యాటింగ్కు దింపొచ్చని తెలిపాడు. జట్టులో కచ్చితంగా హార్దిక్ వంటి ఆటగాడు ఉండాలని, అతను కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేసినా.. భారత జట్టు ఆ మ్యాచ్లో విజయానికి చేరువ అయ్యే అవకాశాలు ఉంటాయని వివరించాడు.