ప్రస్తుత ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్న ఆటగాడు హార్దిక్ పాండ్యా. ఫిట్నెస్ లేమి కారణంగా కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన పాండ్యా.. ఈ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సారధిగా చాలా కాలం తర్వాత మళ్లీ క్రికెట్ ఆడాడు. తొలిసారి కెప్టెన్ అవతారం ఎత్తిన అతను.. తన సూపర్ కెప్టెన్సీతో జట్టును ఐపీఎల్ ఫైనల్ చేర్చాడు.
ఈ క్రమంలో అతను అద్భుతమైన సారధ్య ప్రతిభ కనబరిచాడని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్, పాకిస్తాన్ లెజెండ్ షోయబ్ అక్తర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఈ ఐపీఎల్లో పాండ్యా తన ముద్ర వేస్తున్నాడు అనడం వాస్తవం. టీమిండియా కెప్టెన్సీ తలుపులు తడుతున్నాడు. రోహిత్ ఎంతకాలం కెప్టెన్సీ చేస్తాడో తెలియదు కాబట్టి.. పాండ్యా కఛ్చితంగా రేసులో ఉన్నట్లే’’ అని అక్తర్ అన్నాడు.
భారత జట్టుకు కెప్టెన్సీ చేయడం ఎప్పుడూ సులభం కాదని, ఈ విషయంలో పాండ్యా నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికా సిరీస్ పూర్తయ్యే సరికి అన్ని ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. అతని స్థానంలో రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అందించారు. అయితే వీళ్లిద్దరూ సీనియర్ ప్లేయర్లు కావడంతో.. రోహిత్ తర్వాత టీమిండియా సారధి ఎవరనే విషయంపై చర్చ మొదలైంది.