ఐపీఎల్ 2022 ట్రోఫీ గెలుచుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి గుజరాత్ టైటాన్స్ జట్టు కోచ్ గ్యారీ కిర్స్టన్ మాట్లాడాడు. 2011లో భారత జట్టు వన్డే ప్రపంచ కప్ నెగ్గినప్పుడు కూడా అతనే కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే. గుజరాత్ సారధిగా తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా చాలా సహనం చూపించాడని కిర్స్టన్ అన్నాడు.
భారత్లో అతను ఒక స్టార్ ఆటగాడని, కానీ ఆ గర్వం అతనిలో ఏమాత్రం లేదని చెప్పాడు. ‘‘హార్దిక్ చాలా సహనం, ఓర్పు ఉన్నవాడు. కెప్టెన్గా తను నేర్చుకోవాల్సింది చాలా ఉందని అతనికి కూడా తెలుసు. అవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందుకోసం తన జట్టు సభ్యులతో సాధ్యమైనంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. నా దృష్టిలో అది చాలా చాలా ముఖ్యం’’ అని కిర్స్టన్ వివరించాడు.
ఈ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన జట్లలో గుజరాత్ టైటాన్స్ కూడా ఒకటి. ఈ జట్టుకు సారధిగా ఉన్న హార్దిక్ పాండ్యా.. తొలి సీజన్లోనే ట్రోఫీ నెగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు.