ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు హార్దిక్ పాండ్యా. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన అతను.. మళ్లీ జట్టు గడప తొక్కలేదు. దీంతో అతనిపై వేటు పడిందని, ఇక భారత జట్టులో పునరాగమనం చేయడం కష్టమేననే వార్తలు వచ్చాయి.
అలాంటి సమయంలో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సారధిగా ఐపీఎల్లో ఆడిన హార్దిక్.. తన అద్భుతమైన ఆటతీరు, కెప్టెన్సీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. హార్దిక్ సారధ్యంలో టోర్నీ మొత్తం డామినేట్ చేసిన గుజరాత్ జట్టు.. చివరకు టైటిల్ కూడా ఎగరేసుకుపోయింది. ఈ క్రమంలో భారత జట్టులో చోటు కోల్పోవడం గురించి మాట్లాడిన హార్దిక్..
‘‘నాపై టీమిండియా యాజమాన్యం వేటు వేసిందని అందరూ అంటున్నారు. కానీ అది నిజం కాదు. నేనే లాంగ్ బ్రేక్ తీసుకున్నా. ఈ విషయంలో నాకు మద్దతుగా ఉన్నందుకు బీసీసీఐకి, జట్టు మేనేజ్మెంట్కు చాలా కృతజ్ఞతలు. ఎప్పుడూ కూడా నేను జట్టులోకి రావలసిందే అని వాళ్లు చెప్పలేదు. నేను కూడా విశ్రాంతి కావాలనే అనుకున్నా’’ అని వివరించాడు. ఐపీఎల్ తర్వాత హార్దిక్పై తమ నమ్మకాన్ని ఉంచిన బీసీసీఐ.. సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కు అతన్ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.