Harbhajan Singh: వచ్చే నెల 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) జరుగనుంది. దాంతో, రెండు రోజుల క్రితం సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది. అయితే.. అందులో ప్రధానంగా ఇద్దరు ఆటగాళ్లు మిస్ అయ్యారని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) అన్నాడు. సొంతగడ్డపై జరుగనున్న మెగా టోర్నీలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉండగా.. భారత్ మాత్రం కేవలం ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ (కుల్దీప్ యాదవ్)ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భజ్జీ మాట్లాడుతూ.. యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal)తో పాటు లెఫ్టార్మ్ సీమర్ అర్ష్ దీప్ సింగ్(Arshdeep Singh)కు చోటు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు.
‘వరల్డ్ కప్ స్క్వాడ్లో ఇద్దరి లోటు కనిపిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎంతో ప్రమాదకరమైన మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్తో పాటు అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేయాల్సింది. కొత్త బంతితో చక్కటి ప్రదర్శన చేసే అర్ష్దీప్ను ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదు. మ్యాచ్ ఆరంభంలో వికెట్లు తీసే సత్తా ఉన్న అర్ష్ దీప్ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటే.
యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్
ఆస్ట్రేలియాకు మిషెల్ స్టార్క్, పాకిస్థాన్కు షాహీన్ షా అఫ్రిది ఎలాగైతే ఆరంభంలోనే వికెట్లు తీస్తారో అలాగే అర్ష్ దీప్ కూడా పనికొచ్చేవాడు. ఇక చాహల్ విషయానికి వస్తే.. అతడు మ్యాచ్ విన్నర్ అని గతంలోనే నిరూపించుకున్నాడు. అతడు జట్టులో ఉండాల్సింది. నేను జట్టు మేనేజ్మెంట్లో భాగమైతే తప్పకుండా చాహల్ను ఎంపిక చేసేవాడిని’ అని హర్భజన్ తెలిపాడు. ఇక ఈ మెగాటోర్నీలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కీలకమవుతాడని భజ్జీ జోస్యం చెప్పాడు. ఎలాంటి స్థితి నుంచైనా మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లగల సత్తా అతడిలో ఉందని అభిప్రాయపడ్డాడు.