King’s Cup 2023 : ఈ ఏడాది హ్యాట్రిక్ ట్రోఫీలు అందుకున్న భారత ఫుట్బాల్ జట్టు(Indian Football Team)కు కింగ్స్ కప్(King’s Cup)లో షాక్ తగిలింది. థాయ్లాండ్లో ఈరోజు జరిగిన సెమీ-ఫైనల్లో సునీల్ ఛెత్రీ (Sunil Chhetri)సేన అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ సీజన్లో టీమిండియా ఫైనల్ చేరకపోవడం ఇదే మొదటిసారి. పెనాల్టీ షూటౌట్లో 5-4తో విజయం సాధించిన ఇరాక్ ఫైనల్కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో ఇరాక్ రెండో సెమీఫైనల్ విజేతతో తలపడనుంది. లెబనాన్, థాయ్లాండ్ జట్లు రెండో ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి.
ఈ మ్యాచ్లో భారత జట్టు రెండు గోల్స్తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే.. ఇరాక్ ఆటగాళ్లు పట్టువిడవకుండా పోరాడి స్కోర్ సమం చేశారు. ఆట కీలక దశలో ఇరాక్ ఆటగాడుజిందాన్ ఇక్బాల్( Zidane Iqbal) రెడ్ కార్డ్ కారణంగా మైదానం వీడాడు. దాంతో, ఆ జట్టు పది మందితోనే ఆడింది. విజేతను నిర్ణయించేందుకు పెట్టిన షూటౌట్లో భారత్ 4-5తో వెనకబడింది. ఇరాక్ ఆటగాడు బోన్యన్ ఐదో గోల్ కొట్టడంతో ఆ జట్టు సంబురాల్లో మునిగిపోయింది.
శాఫ్ చాంపియన్షిప్స్ ట్రోఫీతో భారత జట్టు
కెప్టెన్ సునీల్ ఛెత్రీ అద్భుత ప్రదర్శనకు తోడూ యువ ఆటగాళ్లు రాణించడంతో ఈ ఏడాది భారత జట్టు వరుస విజయాలు సాధించింది. సొంత గడ్డపై జరిగిన ముక్కోణపు టోర్నెమెంట్, ఇంటర్ కాంటినెంటల్ కప్(Intercontinental Cup), శాఫ్ చాంపియన్షిప్స్(SAFF Championship)లో విజేతగా నిలిచింది. అంతేకాదు ఫిఫా ర్యాంకింగ్స్లో 100లోపు నిలిచింది.