లక్నో : సైన్యంలో పనిచేసి రిటైరైన ఓ జవానుపై యూపీ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వాహన పత్రాలు చూపలేదంటూ చిత్రహిం సలకు గురిచేశారు. అడ్డొచ్చిన అతడి చెల్లెల్లపై చేయి చేసుకున్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగుచూసింది. మే నెల 3న రేషమ్ సింగ్ అనే రిటైర్డ్ జవాన్ తన తల్లి, ఇద్దరు చెల్లెల్లతో కలిసి కారులో యూపీలోని పురాన్పూర్ గుండా వెళ్తుండగా వారి కారును అడ్డుకున్న ఎస్ఐ రామ్ నరేశ్ సింగ్ కారుకు సంబంధించిన పత్రాలు చూపించాలని ఆయనను అడిగాడు. పత్రాలను వెదుకడంలో ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ఎస్ఐ రేషమ్ను దుర్బాషలాడాడు. అతడికి అక్కడున్న పోలీసులు కూడా జతకలిసి మతం పేరుతో దూషించి, కొట్టి, తలపాగా లాగారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్టేషన్కు తరలించారు. అక్కడ అత్యంత దారుణంగా చిత్రహింసల పాల్జేశారు. బెయిల్పై విడుదలైన రేషమ్ సింగ్ పోలీసుల వైఖరిపై స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఉన్నతాధికారులు బాధ్యుడైన రామ్ నరేశ్ సింగ్ను సస్పెండ్ చేశారు.