సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ వేదికగా జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) వీక్షకులకు శుభవార్త. హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన రేసును ప్రత్యక్షంగా వీక్షించిన ప్రేక్షకులకు టిక్కెట్ల డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు గురువారం నిర్వాహకులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జరుగాల్సిన రేసు కొన్ని అవాంతరాల వలన ప్రాక్టీస్తో ముగిసింది. దీనికి తోడు కొందరికీ గ్యాలరీలోకి ప్రవేశం లభించలేదు. ఈ నేపథ్యంలో రూ.799 నుంచి అంతకుమించి టిక్కెట్లను కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు. ఈ మేరకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ-మెయిల్, ఫోన్లకు సందేశాల ద్వారా తెలియజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.