IND vs ENG: ఐదేండ్ల తర్వాత భాగ్యనగరం అంతర్జాతీయ టెస్టు మ్యాచ్కు ఆతిథ్యమివ్వబోతున్న తరుణంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) శుభవార్త చెప్పింది. ఇండియా – ఇంగ్లండ్ మధ్య ఈనెల 25 నుంచి మొదలుకావాల్సి ఉన్న తొలి టెస్టులో విద్యార్థుల (స్కూల్ స్టూడెంట్స్)తో పాటు ఆర్మీ జవాన్లకు ఉచితంగా మ్యాచ్ను వీక్షించే అవకాశం కల్పించింది. ఈ మేరకు శనివారం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రావు మాట్లాడుతూ… ‘మేము హెచ్సీఏలో ఎన్నికైన తర్వాత నిర్వహించబోతున్న మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇది. మ్యాచ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అధునాతన హంగులతో స్టేడియాన్ని తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మ్యాచ్ను ఉచితంగా చూపించాలని నిర్ణయించాం. మ్యాచ్ చూడాలనుకునే స్కూల్ నుంచి లెటర్ అందితేనే వారిని స్టేడియంలోకి ఉచితంగా ఆట చూసేందుకు అనుమతిస్తాం. ఒక స్కూల్కు ఒక్క రోజు మాత్రమే అవకాశముంటుంది..’ అని తెలిపారు. స్కూల్ పిల్లల టికెట్ల కోసం ప్రత్యేకమైన డెస్క్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు.
పాఠశాల విద్యార్థులతో పాటు దేశ సేవ చేస్తున్న ఆర్మీ, నేవి అధికారులకు ఈ టెస్టు మ్యాచ్ను చూపించాలని నిర్ణయం తీసుకున్నట్టు జగన్మోహన్ రావు తెలిపారు. ఆర్మీ జవాన్లతో పాటు వారి కుటుంబసభ్యులకూ మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తామని అన్నారు. ఇందుకు ఆసక్తిగలవారు సంబంధిత విభాగాధిపతితో సంతకం చేయించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే 26 వేల దాకా టికెట్లను విక్రయించినట్టు జగన్మోహన్ రావు చెప్పారు. జింఖానా గ్రౌండ్స్లో ఫిజికల్ టికెట్లను విక్రయిస్తున్నట్టు తెలిపారు. సుమారు ఇప్పటికే 26 వేల దాకా టికెట్స్ను విక్రయించామని ఆయన వెల్లడించారు.
Indian team will reach Hyderabad today for the Test series against England.
– All the best, India. 🇮🇳 pic.twitter.com/W24eq4VAFD
— Johns. (@CricCrazyJohns) January 20, 2024
ఉప్పల్ స్టేడియంలో భారత్ ఆఖరిసారి (టెస్టులలో) 2018లో వెస్టిండీస్తో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పరిమిత ఓవర్ల, ఐపీఎల్ మ్యాచ్లు తప్ప రెడ్ బాల్ క్రికెట్కు ఆతిథ్యమివ్వలేదు. బజ్బాల్ ఆటతో దూకుడుమీదున్న ఇంగ్లండ్.. ఇంచుమించూ అదే బాటలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి హైదరాబాద్లో ‘ఉప్పల్ మే సవాల్’ అనేందుకు సిద్ధమౌతున్న నేపథ్యంలో భాగ్యనగర క్రికెట్ అభిమానులకు అసలైన టెస్టు మజా అందనుంది.