‘మజ్దూర్, కూలీ.. ఇలా ఏ పేరుతో పిలిచినా మనకు సాయపడేవారు ఎవరైనా మీ సోదరులు’ అని చెప్పారు ముహమ్మద్ ప్రవక్త (స). సమాజంలో ఎవరూ ఎక్కువా తక్కువా కాదు. ఒకరినొకరు పరస్పరం సాయం అందించుకునేందుకే జాతులుగా, తెగలుగా విభజన జరిగిందని ఖురాన్ చెబుతుంది. ఎవరినైనా తమ దగ్గర పనిలో పెట్టుకుంటే వారి వేతనాన్ని చెల్లించాలన్నది ఇస్లాం బోధనల సారాంశం. వారికి చెందాల్సిన హక్కును వారికి అందించాలి. ‘కూలీవాని చెమట చుక్కలు ఆరకముందే అతని కష్టార్జితాన్ని ఇచ్చేయాలి’ అన్న ప్రవక్త ఉద్బోధ కష్టజీవుల కష్టార్జితం దోచుకోకూడదని చెబుతుంది. ఎవరైనా తమ వద్ద పనిచేసే కూలీవాని వేతనాన్ని ఎగ్గొట్టిన వ్యక్తికి అంతిమ దినాన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు ప్రవక్త (స).
May Day | ప్రవక్త బోధనల గ్రంథంలోని ఓ గాథ కూలీల శ్రమకు ఎంతటి విలువ ఇవ్వాలో చాటిచెబుతుంది. పూర్వం ఒక వ్యక్తి దగ్గర ఓ కూలీ పనిచేసేవాడు. ఏ రోజు కూలీ డబ్బులు ఆరోజు తీసుకుని వెళ్లేవాడు. అయితే ఒకరోజు రోజంతా పనిచేసి తీరా కూలీ డబ్బులు ఇచ్చే సమయానికి అతను కానరాలేదు. ఆ యజమాని అతని కూలీ డబ్బులను కొన్ని రోజుల వరకూ భద్రంగా ఉంచాడు. ఎంతకూ ఆ కూలీ రాకపోయేసరికి ఆ డబ్బును తన వ్యవసాయంలో పెట్టుబడిగా పెట్టాడు. అతని వాటాకింద వచ్చిన లాభాలను మళ్లీ పెట్టుబడిగా పెట్టసాగాడు. అందులోంచి ఒక్క రూపాయి కూడా తన సొంతానికి వాడేవాడు కాదు.
కొన్నేండ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఆ కూలీవాడు యజమానికి తారసపడ్డాడు. గతంలో మరచిపోయిన కూలీ డబ్బులు చెల్లించమని అడిగాడు. అప్పుడు ఆ యజమాని ‘అదిగో ఆ పొలం నీదే, ఈ మేకలు, ఈ ధాన్య రాశులు నీవే’ అని చెప్పడంతో ఆ కూలీవాడు ఖంగుతిన్నాడు. యజమాని చెప్పేది నమ్మలేకపోయాడు. తనను అపహాస్యం చేస్తున్నాడని తలపోశాడు. కూలీ డబ్బులు ఇచ్చేస్తే వెళ్లిపోతానని బతిమాలాడు. యజమాని అసలు విషయాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తే కూలీవాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
ఒకసారి హసన్ బస్రీ (రహ్మాలై) దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు. ‘ఈ రోజు నుంచి నేను ఎలాంటి పనిచేయను, సంపాదించను’ అని చెప్పాడు. హసన్ బస్రీ (రహ్మాలై) ఎందుకని అడిగారు. దానికా యువకుడు ‘నేను ఈ రోజు అడవిలో ఒక వింత సంఘటన చూశాను. ఒక పులి ఒక జంతువుపై పంజా విసిరింది. తనకు కావాల్సింది తిన్నది. మిగతాది పర్వతంపై ఒక నడవలేని ఓ గుడ్డి తోడేలుకు అందించింది. అడవిలోని తోడేలు కడుపునింపే ఆ అల్లాహ్ నా ఆకలి తీర్చడా. అందుకే ఈ రోజు నుంచీ ఏ పని చేయను’ అని వివరణ ఇచ్చాడు.
హసన్ బస్రీ (రహ్మాలై) కలగజేసుకుని ‘నీకు పులిగా మారాలని లేదా? తోడేలుగా మారాలనుకుంటున్నావా?’ అని ఎదురు ప్రశ్నించారు. మజ్దూర్లు ఎప్పటికీ తోడేళ్లు కారు. కూలీ పనిచేసేవాళ్లు పులులు’ అని ప్రశంసించారు హసన్ బస్రీ (రహ్మాలై). అందుకే కూలీలు తలఎత్తుకు తిరగాలి. ప్రవక్తలు, ఖలీఫాలు కూలీ పనులు చేసుకుని ఉపాధి పొందేవారు. ఖలీఫా అబూబకర్ (రజి) చక్రవర్తిగా తాను కూలీవాని కంటే ఎక్కువ జీతాన్ని తీసుకునేవారు కాదు. మన దగ్గర పనిచేసే వారికి మనం తిన్నదే ఆహారంగా ఇచ్చి గౌరవించాలని ప్రవక్త (స) ఉద్బోధ. కార్మికుల స్వేదాన్ని గౌరవించడం యజమాని బాధ్యత. వారి కష్టానికి తగిన వేతనం ఇవ్వడం ధార్మిక విధి.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076