Sachin Tendulkar | టీ20 వరల్డ్ కప్లో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియాపై పలువురు పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరును నమోదు చేయలేకపోయిందని, తీవ్ర నిరాశకు గురయ్యేలా ఓడిపోయామని సచిన్ పేర్కొన్నారు. అయితే మంచి స్కోరు చేయలేదన్న విషయాన్ని అందరూ అంగీకరించాలి. టీమిండియాకు ఆ మ్యాచ్ క్లిష్టతరంగా మారింది. అయితే, టీమిండియా మొత్తానికి టీ20ల్లో బాగానే రాణిస్తోందని, ఆ ఫార్మాట్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని సచిన్ గుర్తు చేశారు.
ఇక రాత్రికి రాత్రే నంబర్ 1 పొజిషన్ చేరుకోవడానికి సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. టీ20 సెమీఫైనల్లో భారత జట్టు ఇచ్చిన ప్రదర్శనను చూసి, ఆ జట్టు ఆటతీరును నిర్ణయించడం సరికాదన్నారు. ఏ ఆటగాడు కూడా టీమ్ ఓడిపోవాలని కోరుకోడు అని తెలిపారు. క్రీడల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని సచిన్ స్పష్టం చేశారు.