Gautam Gambhir : భారత పురుషుల జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) స్వదేశంలో తొలి సిరీస్ ముందు విరాట్ కోహ్లీ(Virat Kohli)తో సరదాగా ముచ్చటించాడు. ఐపీఎల్లో తమ మధ్య మొదలైన వివాదానికి తెరదించిన ఈ ఇద్దరూ ఓ ఇంటర్వ్యూలో జాలీగా నవ్వుతూ కనిపించారు. ఆ వీడియోను బీసీసీఐ(BCCI) ఎక్స్ ఖాతాలో పెట్టింది. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ముందు సాగిన ఈ ఇంటర్వ్యూలో గంభీర్.. కోహ్లీతో ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిన రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ శివనామ స్మరణ చేశాడని.. తానేమో హనుమాన్ చాలీసా వింటూ గడిపానని గౌతీ చెప్పాడు.
‘టీమిండియా 2014-15లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన జట్టులో కోహ్లీ, నేను ఉన్నాం. అప్పుడు కోహ్లీ ప్రతి బంతిని ఎదుర్కొనేముందు ఓం నమః శివాయ అని అనేవాడు. అలా అతడు ఏకాగ్రతగా బ్యాటింగ్ చేశాడు. ఇక నా విషయానికొస్తే.. నాపియర్ టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాను. స్టంప్స్ పడగానే డ్రెస్సింగ్ రూమ్కి వచ్చాక ‘హనుమాన్ చాలీసా’ వింటూ గడిపాను.
A Very Special Interview 🙌
Stay tuned for a deep insight on how great cricketing minds operate. #TeamIndia’s Head Coach @GautamGambhir and @imVkohli come together in a never-seen-before freewheeling chat.
You do not want to miss this! Shortly on https://t.co/Z3MPyeKtDz pic.twitter.com/dQ21iOPoLy
— BCCI (@BCCI) September 18, 2024
అందుకనే రెండున్నర రోజులు బ్యాటింగ్ చేయగలిగాను’ అని గంభీర్ వెల్లడించాడు. ఆ సిరీస్లో ఉగ్రరూపం ప్రదర్శించిన కోహ్లీ ఆసీస్ బౌలర్లను ఉతికేశాడు. ఏకంగా నాలుగు సెంచరీలతో కలిపి 692 రన్స్ కొట్టాడు. ఇక గంభీర్ నాపియర్ టెస్టులో 436 బంతుల్ని ఎదుర్కొని 137 పరుగులతో మ్యాచ్ డ్రా చేశాడు. అయినా ఇండియా 2-0తో సిరీస్ కోల్పోయింది.
బీసీసీఐ పోస్ట్ చేసిన ఇంటర్వ్యూ వీడియో ప్రారంభం కాగానే కోహ్లీ, గంభీర్లు నవ్వుతూ పలకరించుకున్నారు. ఇక్కడితో మసాలాకు ముగింపు పలుకుతున్నాం అని విరాట్ అనగానే.. గౌతీ కూడా ఓకే అన్నట్టు తలూపాడు. ఈ వీడియోలో కోహ్లీ, గంభీర్లు భారత జట్టు విజయాల్లో భాగమైన తీరును చూపించారు.
ఐపీఎల్లో గొడవపడుతున్న కోహ్లీ, గంభీర్
మైదానంలో కోహ్లీ, గంభీర్లు ఎంత దూకుడుగా ఉంటారో తెలిసిందే. ప్రత్యర్థి జట్టు వీళ్లను పొరపాటున కవ్వించిందంటే.. ఇక అంతే. అలాంటిది ఈ ఇద్దరు ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో నువ్వానేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగారు. ఇక 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా ఉన్న గౌతీ ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం కోహ్లీతో గొడవపడ్డాడు. అందుకు కోహ్లీ కూడా గౌతీని ఉరిమి ఉరిమి చూసిన విషయం తెలిసిందే.
పొట్టి వరల్డ్ కప్ అనంతరం శ్రీలంక పర్యటనతో హెడ్కోచ్ అవతారం ఎత్తిన గంభీర్కు స్వదేశంలో ఇది మొదటి సిరీస్. లంకపై టీ20, వన్డే సిరీస్లో పవర్ హిట్టర్లతో బౌలింగ్ చేయించిన గంభీర్ ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. బంగ్లాదేశ్పై రెండు టెస్టుల్లో గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) ఫైనల్కు టీమిండియా మరింత చేరువైతుంది.