Gautam Gambhir : ఆసియా కప్(Asia cup 2023)లో భాగంగా శనివారం జరిగిన భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ అభిమానులకు నిరాశే మిగిల్చింది. అయితే.. వర్షం కారణంగా రద్దు అయిన ఈ మ్యాచ్కు ముందూ, తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లు, పాకిస్థాన్ ఆటగాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో.. ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరిగిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కన్నా గొప్ప గౌరవం మరొకటి ఉండదని గౌతీ అన్నాడు.
‘జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ప్రత్యర్థి ఆటగాళ్లతో స్నేహాన్ని మైదానం బయటే వదిలేయాలి. గ్రౌండ్లో అడుగుపెట్టాలి’అని గంభీర్ తెలిపాడు. క్రికెటర్గా కొనసాగినంత కాలం తన దూకుడుతో ఆకట్టుకున్న గౌతీ.. ప్రస్తతుం కామెంటేటర్గానూ అదే ధోరణి కొనసాగిస్తున్నట్లు కనిపిస్తున్నది. గతంలో పాక్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi)తో పలుమార్లు మైదానంలో గొడవకు దిగిన గంభీర్ దేశం కోసం ఆడేటప్పుడు అలాంటి కసి ఉంటేనే మంచిదని వెల్లడించాడు.
గతంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అనగానే భావోద్వేగాలు ఎక్కువగా కనిపించేయి. ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వాళ్లు. మాజీలు సైతం మాటల యుద్ధానికి తెరతీసి మరింత గందరగోళానికి కారణం అయ్యేవాళ్లు. అయితే ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. గతంలో మాదిరిగా దూషణలు, గొడవలు పెద్దగా కనిపించడం లేదు. శుక్రవారం పల్లెకెలె స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా భారత్, పాక్ ప్లేయర్లు ఎంతో సరదాగా కనిపించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాక్ ప్లేయర్లతో సుదీర్ఘంగా ముచ్చటించారు.
హరీస్ రవుఫ్, కోహ్లీ
ప్రాక్టీస్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పాక్ పేసర్ హరీస్ రవుఫ్(Haris Rauf), కోహ్లీతో మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అనే నినాదాలే చేస్తున్నారు’ అంటూ విరాట్ను హత్తుకున్నాడు. అయితే.. అవన్నీ కామనే అన్నట్లు కోహ్లీ స్పందించాడు. వీళ్లిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.