అందివచ్చిన అవకాశాన్ని మన అమ్మాయిలు చేజార్చుకున్నారు. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి కామన్వెల్త్ గేమ్స్లో ఘనంగా బోణీ కొట్టాలనుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఉత్కంఠ పోరులో చివరి వరకు ఆధిక్యం ప్రదర్శించిన హర్మన్ బృందం.. ఆఖర్లో పట్టు చేజార్చి మూల్యం చెల్లించుకుంది!
సుదీర్ఘ విరామం తర్వాత కామన్వెల్త్ గేమ్స్లో తిరిగి ప్రవేశ పెట్టిన క్రికెట్లో మన అమ్మాయిలకు శుభారంభం దక్కలేదు. గ్రూప్ -‘ఏ’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన మన అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేశారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 52; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. షఫాలీ వర్మ (33 బంతుల్లో 48; 9 ఫోర్లు), స్మృతి మందన (24; 5 ఫోర్లు) వేగంగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో జెస్ జాన్సన్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. రేణుక (4/18) నిప్పులు చెరగడంతో ఒక దశలో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆస్ట్రేలియాను ఆష్లే గార్డ్నర్ (35 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), గ్రేస్ హారిస్ (37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.