Gautam Gambhir : భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటతోనే కాదు మాటలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు. గౌతీ తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Shah Rukh Khan)ను కలిశాడు. ఆ సందర్బంగా అతడు షారుక్తో దిగిన ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటోకు కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) కెప్టెన్ నితీశ్ రానా(Nitish Rana) ఆసక్తికర కామెంట్ పెట్టాడు.
‘మళ్లీ సొంత గూటికి వస్తున్నారనే సంకేతమా? నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది’ అంటూ రానా కామెంట్ చేశాడు. ఒకప్పుడు కోల్కతా కెప్టెన్ అయిన గంభీర్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మెంటార్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో గంభీర్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈ మాజీ ఓపెనర్ కోల్కతాకు రెండు ట్రోఫీలు అందించాడు. 2012, 2014లో అతడి సారథ్యంలోని కేకేఆర్ చాంపియన్గా అవతరించింది.
2018లో క్రికెట్కు గుడ్ బై చెప్పిన గౌతీ ఆ తర్వాత కామెంటేటర్గా అవతారం ఎత్తాడు. గంభీర్ తర్వాత ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్, శ్రేయస్ అయ్యర్, .. ఇలా కెప్టెన్లు అయితే మారారు. కానీ, కేకేఆర్ జట్టు ఆట మాత్రం మారలేదు. 16వ సీజన్లో నితీశ్ రానా సారథ్యంలో ఆ జట్టు ప్లే ఆఫ్స్ ముందే చేతులెత్తేసింది.
గంభీర్, విరాట్ కోహ్లీ
రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన గంభీర్ను లక్నో జట్టు మెంటార్గా తీసుకుంది. 16వ సీజన్లో గంభీర్ ఆర్సీబీ ఆటగాడైన విరాట్ కోహ్లీ(Virat Kohli)తో మైదానంలోనే గొడవకు దిగాడు. అప్పటినుంచి కోహ్లీ అభిమానులు ఈ మాజీ ఓపెనర్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అతడు ఎక్కడ కనిపించినా కోహ్లీ.. కోహ్లీ అని గట్టిగా అరుస్తున్నారు.