న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్ 16లో రాజస్థాన్ తరఫున ఆడి పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (Yashasvi Jaiswal) గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. వచ్చే నెల 7న లండన్లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుతో ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు క్రికెట్ ఛాంపియన్స్షిప్ (WTC) ఫైనల్ టీమ్లో అతను చోటు దక్కించుకున్నాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య WTC ఫైనల్ కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఇప్పటికే జట్టును ప్రకటించింది.
బీసీసీఐ ప్రకటించిన ఆ ప్రాథమిక స్వ్కాడ్లో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్టాండ్ బై ఓపెనర్గా ఉన్నాడు. అయితే వచ్చే నెల 3, 4 తేదీల్లో రుతురాజ్ గైక్వాడ్ వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో జూన్ 5వ తేదీలోపు తాను జట్టుతో కలువలేనని బీసీసీఐకి రుతురాజ్ గైక్వాడ్ సమాచారమిచ్చాడు. దాంతో గైక్వాడ్ స్థానంలో యశస్వి జైశ్వాల్ను స్టాండ్ బై ఓపెనర్గా తీసుకున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించాడు.
త్వరలోనే జైశ్వాల్ లండన్ ఫ్లైట్ ఎక్కడనున్నాడని ఆయన తెలిపాడు. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా ఇవాళ్టితో ముగియనున్న ఐపీఎల్ సీజన్ 16లో RR జట్టు తరఫున యశస్వి జైశ్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం 14 మ్యాచ్లు ఆడి 625 పరుగుల స్కోర్ సాధించాడు.