KL Rahul |టీమిండియాలో తరుచూ గాయాల బారిన పడే క్రికెటర్ల జాబితాలో ముందువరుసలో ఉండేవాళ్లలో రవీంద్ర జడేజా తర్వాత వినిపించే పేరు కెఎల్ రాహుల్. కొన్నాళ్లుగా ఈ కర్నాటక బ్యాటర్ జట్టుతో మ్యాచ్లు ఆడినదానికంటే గాయాల కారణంగా వదులుకున్నవే ఎక్కువ ఉంటాయన్న అతిశయోక్తి కాదు. గతేడాది తొడ కండరాలు పట్టేడయంతో సర్జరీ చేయించుకుని ఆసియా కప్లో రీఎంట్రీ ఇచ్చిన రాహుల్కు మళ్లీ అదే గాయం తిరగబెట్టిందా..? స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆడిన రాహుల్.. అదే గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు ముందు తప్పుకున్నాడు. అయితే రాజ్కోట్ టెస్టు ప్రారంభానికి ముందు 90 శాతం ఫిట్నెస్తో ఉన్న రాహుల్ను నాలుగో టెస్టులో టీమిండియా ఎందుకు పక్కనబెట్టింది..?
తొడ కండరాల గాయంతో ఎన్సీఏకు వెళ్లిన రాహుల్.. వారం రోజుల్లోనే కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని వార్తలు వచ్చాయి. రాజ్కోట్ టెస్టులో అతడు ఆడతాడని కూడా బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కానీ ఆ మ్యాచ్కు ముందు రాహుల్ 90 శాతం ఫిట్నెస్ మాత్రమే ఉన్నాడని, రాంచీ టెస్టు వరకు అతడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తాడని, ఆ మ్యాచ్లో ఆడతాడనీ బోర్డు వర్గాలు చెప్పాయి. కానీ రెండ్రోజుల క్రితం బీసీసీఐ.. అతడు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని, ఐదో టెస్టుకూ అనుమానమే అని కొత్త ట్విస్ట్ ఇచ్చింది.
గాయం తిరగబెట్టిందా..?
బీసీసీఐ ప్రకటనతో అసలు రాహుల్కు ఏమైంది..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాహుల్కు గతేడాది ఐపీఎల్లో బాధపెట్టిన గాయం మళ్లీ తిరగబెట్టిందా..? ఈ విషయాన్ని ఎన్సీఏ, బీసీసీఐలు దాచిపెడుతున్నాయా..? అని కూడా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్కోట్ టెస్టుకు ముందే 90 శాతం ఫిట్నెస్ సాధించిన క్రికెటర్.. 8 రోజులు గడిచిన తర్వాత ఫిట్నెస్ కోల్పోయాడా..? అన్నది అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న. ధర్మశాల టెస్టులోనూ అతడు ఆడేది అనుమానమని కూడా గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగానే రాహుల్కు గాయం తిరగబెట్టిందన్న వాదనలు వస్తున్నాయి.
వ్యూహంలో భాగమా..?
ఒకవేళ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకున్నా రాంచీ టెస్టు స్పిన్కు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్లో రాహుల్ను తీసుకొచ్చి ఎవర్నో ఒకర్ని తీసేయడం కంటే అతడిని బెంచ్కే పరిమితం చేయాలన్న వ్యూహం ఉందన్న వాదన లేకపోలేదు. రాహుల్ను పక్కనబెట్టి ఈ మ్యాచ్లో నలుగురు స్పిన్నర్లతో ఆడేందుకు టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలస్తున్నది. రాహుల్ వస్తే సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్లలో ఎవర్నో ఒకర్ని బెంచ్కే పరిమితం చేసే అవకాశముంటుంది. ఇటీవలే అరంగట్రం చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లను పక్కనబెడితే వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే గాక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే టీమ్ మేనేజ్మెంట్ ఇలా చేసి ఉండొచన్న వాదనలూ ఉన్నాయి.