Wrestlers Protest: ఏడాదిగా పోరుబాట పట్టిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో కొత్త మలుపు. ఇన్నాళ్లూ డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు పోరాటం చేయగా తాజాగా.. ఆ ఆందోళనలు చేసినవారిలో కీలకంగా వ్యవహరించిన బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్లకు వ్యతిరేకంగా జూనియర్ రెజ్లర్లు రోడ్లమీదకు వచ్చారు. ఈ ముగ్గురి వల్ల తమ కెరీర్ ప్రశ్నార్థకమవుతున్నదని, వారి నుంచి భారత రెజ్లింగ్ను కాపాడాలని నినదిస్తూ ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగారు.
ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి వందలాదిగా తరలివచ్చిన రెజ్లర్లు.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 300 మందికి పైగా జూనియర్ రెజ్లర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ నుంచి ఎక్కువమంది రెజ్లర్లు వచ్చారు. జంతర్ మంతర్ వద్ద ‘యూడబ్ల్యూడబ్ల్యూ.. మా రెజ్లింగ్ను ఈ ముగ్గురి చెర నుంచి కాపాడండి..’ అని బ్యానర్లను ప్రదర్శిస్తూ నినదించారు.
#WATCH | Young wrestlers hold protests against Olympic-winning wrestlers Sakshee Malikkh, Vinesh Phogat and Bajrang Punia, at Delhi’s Jantar Mantar pic.twitter.com/5yHVsksKp8
— ANI (@ANI) January 3, 2024
పలువురు రెజ్లర్లు మాట్లాడుతూ… ‘యూపీలో సుమారు 90 శాతం ట్రైనింగ్ సెంటర్స్, అక్కడ శిక్షణ పొందుతున్న వేలాది మంది రెజ్లర్లు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. ఆ ముగ్గురు (పునియా, వినేశ్, సాక్షి) ఒకవైపు ఉండగా దేశంలో లక్షలాది మంది రెజ్లర్లు మరోవైపు నిలిచారు. వాళ్లకు జాతీయ అవార్డులు అంటే గౌరవం లేదు. కేంద్రం అందజేసిన ఆ అవార్డులను రోడ్లపై పెట్టి వెళ్తున్నారు.. వాళ్లకు డబ్ల్యూఎఫ్ఐలో టాప్ పోస్టులు ఇస్తే ఈ పోరాటాన్ని ముగిస్తారు…’ అని వాపోతున్నారు.