ఢిల్లీ : మహిళల క్రికెట్లో నవ శకానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఐదు ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టుకొని.. పేలవ ప్రదర్శన కనబరిచినవాళ్లను విడుదల చేశాయి. తొలి సీజన్లో ట్రోఫీని సాధించి పెట్టిన హర్మన్ప్రీత్ కౌర్పై ముంబై ఇండియన్స్, ఢిల్లీని ఫైనల్కు తీసుకెళ్లిన మేగ్ లానింగ్పై క్యాపిటల్స్, కెప్టెన్గా.. ప్లేయర్గా విఫలమైన స్మృతి మంధానాపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి నమ్మకం ఉంచాయి.
డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ కోసం ప్లేయర్స్ను అట్టిపెట్టుకునేందుకు ఈ నెల 15 ఆఖరి తేదీ కావడంతో.. ఫ్రాంఛైజీలు గురువారం తాము రీటేన్ చేసుకున్న, వదిలించుకున్న క్రికెటర్ల పేర్లను వెల్లడించాయి. మొత్తం 60 మందిలో విదేశీ క్రికెటర్లతో కలిపి 21 మందిని ఐదు జట్లు అట్టిపెట్టుకున్నాయి. 29 మందిని తమ స్కాడ్ నుంచి విడుదల చేశాయి. హర్మన్ప్రీత్, యస్తికా భాటియా, హీలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్, ఇసాబెల్లె వాంగ్, అమజోత్కౌర్, హుమైరా కాజీ, చ్లోయే ట్రయాన్, జింతిమణి కలిత, పూజా వస్ర్తాకర్, ప్రియాంక బాల, సైకా ఇషాక్లను ముంబై రీటైన్ చేసుకొని.. ధారా గుజ్జర్, హీథర్ గ్రాహమ్, నీలం బిష్త్, సోనమ్ యాదవ్లను విడుదల చేసింది. ఇక.. రన్నరప్ ఢిల్లీ విషయానికొస్తే.. ఐదుగురు విదేశీ క్రికెటర్లతో కలిపి 15 మందిని అట్టిపెట్టుకుంది.