రైతుల ఆర్థిక పరిపుష్టే
సీఎం కేసీఆర్ లక్ష్యం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో వరి సాగు
అన్నదాతలు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు మళ్లాలి
గత ప్రభుత్వాలు మూసీ ప్రాజెక్టుకు చిల్లులు కూడా పూడ్చలే…
నేడు రెండు పంటలకూ నీళ్లు
మంత్రి జగదీశ్రెడ్డి కేసారంలో మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
సూర్యాపేట, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాలపాటు నీళ్లకు గోస తీసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు వరి సాగులో రికార్డులు సృష్టిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మూసీ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రెండు పంటలకు నీళ్లిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సివిల్ సప్లయ్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డితో కలిసి సూర్యాపేట నియోజకవర్గంలోని కేసారం గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో గత వాన కాలం 10.07 లక్షల ఎకరాల్లో వరి వేయగా.. యాసంగిలో రికార్డు స్థాయిలో 11.48 లక్షల ఎకరాల్లో సాగైందని తెలిపారు. సమైక్య పాలకులు వ్యవసాయాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంతోపాటు అనుబంధ వృత్తులనూ పండుగలా మార్చారన్నారు.
కాళేశ్వరం నీళ్లతోనే మా బతుకులు మారినయ్సర్కారు తుమ్మలు మొలిచి ఏండ్లకేండ్లు మమ్మల్ని ఎక్కిరించిన ఎస్సారెస్పీ కాల్వలను చూసి మా భూములకు నీళ్లు వస్తయన్న ఆశలు లేకుండే. కాల్వపొంటే ఐదెకరాల భూమున్నా వానలను నమ్ముకుని పత్తి, కంది వేసుకున్న పరిస్థితి మాది. ఐదు బోర్లు వేసినా.. పది గుంటల వరి పొలం పారేది కాదు. తిరుమలగిరి మార్కెట్కు హమాలీ పనికి పొయ్యి ఇల్లు నెట్టుకొచ్చేటోన్ని. సీజన్ లేనప్పుడు ఊరోళ్లతో కలిసి పని కోసం ఆంధ్రా, కర్ణాటకకు పోతుంటి. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మా బతుకులు మారినయ్. ఎస్పారెస్పీ కాల్వకు నీళ్లొస్తుండడంతో హమాలి పని బంద్ పెట్టి పొలం అచ్చు గట్టిన. నాకున్న భూమితోపాటు నాలుగెకరాలు కౌలుకు తీసుకుని తొమ్మిదెకరాల్లో వరి వేసిన. ఎకరానికి 35 బస్తాల్లెక్క పండినయ్. ఒకప్పుడు ఎడారి తీరున్న మా ఊరి భూములు పచ్చగ కళకళలాడుతున్నయి. ఇప్పుడు మాకే చేతినిండా పని ఉంది. పని దేవులాడుకుంట ఊళ్లు తిరిగే బాధ తప్పింది. ఇదంతా కేసీఆర్ సార్ పుణ్యమే. పంట గూడ ఊళ్లెనే అమ్ముకుంట.
ఉమ్మడి జిల్లా నేడు వరి సాగులో రికార్డులు సృష్టిస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కేసారం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంతోపాటు రైతు వేదికను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మంత్రి జగదీశ్రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ గతంలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలు అంటేనే పంటలు పండక కరువుతో అల్లాడేవని, నేడు కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ధాన్యాన్ని ఈ జిల్లా పండిస్తున్నదని, ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపు నిర్ణయాలతోనే దండుగ అనుకున్న వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఆకలిచావులు, ఆత్మహత్యలు ఉండేవని, అలాంటి రాష్ర్టాన్ని సస్య శ్యామలం చేసిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్దే అన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తోపాటు రైతుబంధు పథకంతో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. మూసీని ఆధునీకరించి రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి
రైతుల ఆర్థిక పరిపుష్టి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక తిప్పలు పడుతున్నారని, ఆయన సూచన మేరకు ప్రత్మామ్నాయ పంటలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మూస పద్ధతికి స్వస్తి పలికి మిర్చి, నూనె గింజల పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు. గతంలో రైతులు తమకున్న భూమిలో తినడానికి వరి వేసుకొని మిగిలిన భూమిలో పెసర, కంది, వేరుశనగ తదితర పంటలు వేసి లాభాలు పొందేవారని గుర్తుచేశారు. ఆరుతడి పంటలతోపాటు పామాయిల్ సాగు లాభదాయకమైందని తెలిపారు. అనంతరం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను సన్మానించారు.
పండుగలా వ్యవసాయం : మంత్రి నిరంజన్రెడ్డి
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత హీన పరిస్థితిలో ఉన్న వ్యవసాయానికి ఊతం ఇచ్చి ఎండిన బీళ్లను పచ్చని పైర్లుగా మార్చి వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వరి పంట సాగులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. వానకాలం కంటే యాసంగిలో ఎక్కువ సేద్యం చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మిర్చితోపాటు కంది, నూనె గింజల పంటలకు అధిక డిమాండ్ ఉన్నదని, రైతులు ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో దొడ్డు రకం వడ్లను సాగు చేయొద్దని, భవిష్యత్తులో అమ్ముడుపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
భిన్నమైన పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. సూర్యాపేట పట్టణంలో సుమారు 2వేల ఇండ్లపై కూరగాయల పంటలు పెంచుతున్నారని, మిద్దె పంటలకు సూర్యాపేటను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎంపీపీలు బీరవోలు రవీందర్రెడ్డి, నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలిత, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, రైతుబంధు సమితి రాష్ట్ర సభ్యుడు గుడిపూడి వెంకటేశ్వర్రావు, సర్పంచ్ మెంతబోయిన నాగయ్య, ఎంపీటీసీ బాలాజీ, సివిల్ సప్లయ్ డీఎం రాంపతినాయక్, డీఆర్డీఏ పీడీ ప్రేమ్కరణ్రెడ్డి, ఇన్చార్జి డీఏఓ రామారావునాయక్, తాసీల్దార్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఎన్నో తిరస్కారాల్ని ఎదుర్కొన్నా!
జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?