హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్ చాంపియన్షిప్ అధికారికంగా రద్దయ్యింది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా రేసింగ్ను రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్(ఎఫ్ఐఏ) శనివారం ప్రకటించింది. నిరుడు అక్టోబర్లో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం కొనసాగించేందుకు సమ్మతించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ కారణంతో పదో సీజన్ ఫార్ములా-ఈ చాంపియన్షిప్ నుంచి హైదరాబాద్ తప్పుకున్నట్టు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వ తిరోగమన చర్య అని విమర్శించారు.
సిటీబ్యూరో,జనవరి 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా-ఈ రేసును రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్(ఎఫ్ఐఏ) శనివారం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన ఫార్ములా-10 సీజన్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వాల్సింది. ఇందుకోసం గతేడాది అక్టోబర్ 30న బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఫార్ములా-ఈ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటంతో సీన్ పూర్తిగా మారిపోయింది. గతేడాది ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఫార్ములా-ఈ పోటీలు దేశం దృష్టిని ఆకర్షించాయి. దేశంలో తొలిసారి ఇలాంటి పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడంతో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు, సెలెబ్రిటీలు పెద్ద ఎత్తును తరలివచ్చారు.
గతేడాది లాగే ఈసారి జరుగుతుందని ఆశిస్తున్న తరుణంలో రేసింగ్ అభిమానులను తీవ్ర నిరాశ కల్గించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా తాము రేసింగ్ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్ఐఏ స్పష్టం చేసింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించేందుకు విముఖత ప్రదర్శించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొంటూ పురపాలక శాఖకు నోటీసులు ఇచ్చింది. దీంతో ఆతిథ్య హోదా నుంచి హైదరాబాద్ను తప్పిస్తూ షెడ్యూల్ ప్రకటించారు. రేసింగ్ రద్దు వలన ప్రముఖ నగరాలైన టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ సరసన నిలిచే అవకాశాన్ని హైదరాబాద్ కోల్పోయినట్లయింది. ఈ నెల 13 నుంచి హాన్కూక్(మెక్సికో) నుంచి ఫార్ములా-ఈ సీజన్ అధికారికంగా ప్రారంభం కాబోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ప్రభుత్వ తిరోగమన చర్య అంటూ ఆయన వ్యాఖ్యానించారు.రేసింగ్ అభిమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
ఫార్ములా-ఈ రేసింగ్ రద్దు కావడం కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ తిరోగమన చర్యే. హైదరాబాద్లో నిర్వహించే ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచ వ్యాప్తంగా మన నగరం, దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్ను పెంచుతాయి. భారతదేశానికి మొదటి సారిగా ఫార్ములా-ఈ తీసుకురావడానికి మేము చాలా కృషి, సమయాన్ని వెచ్చించాం. ప్రపంచంలో హైదరాబాద్ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్య స్థానంగా చేయడానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఉన్న ఔత్సాహికులను, స్టార్టప్లను ఆకర్షించేలా పలు కార్యక్రమాలను నిర్వహించాం. అందులో భాగంగానే వారం రోజుల పాటు ఈవీ సమ్మిట్ను కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని సమర్థంగా వినియోగించేందుకు అవసరమైన వ్యవస్థలు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కార్యక్రమాలను మన రాష్ర్టానికి అత్యవసరమని గుర్తించిన ప్రభుత్వం ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంది. సస్టెయినబుల్ మొబిలిటీ సొల్యూషన్స్కు కేంద్రంగా రాష్ర్టాన్ని ప్రమోట్ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ మొబిలిటీ వ్యాలీని సైతం ప్రారంభించింది.
హైదరాబాద్లో రేసులను నిర్వహించడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించడం గురించి మంచి విషయాలు తెలుసుకునేందుకు దోహదపడింది. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్షిప్ గురించి పాలక ప్రభుత్వం చిన్న చూపు చూడడం బాధాకరం.
– సామ్రాట్.
భారతదేశంలో 2024లో జరిగే ఏకైక అధికారిక ఎఫ్ఐఎ వరల్డ్ చాంపియన్షిప్ ఈవెంట్ హైదరాబాద్ ఈ-ప్రిక్స్. గతేడాది కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పోటీలను ఇక్కడ నిర్వహించడంతో హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.650 కోట్ల వృద్ధి సాధించింది.
– విష్ణువర్దన్రెడ్డి.
భారత్లో మోటార్స్పోర్ట్స్ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసే వార్త ఇది. ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ చాంపియన్షిప్ నిర్వహణ అనేది హైదరాబాద్తో పాటు దేశానికి ఎంతో గర్వకారణం.
– అల్బర్టో లాంగో ఫార్ములా-ఈ కోఫౌండర్
హైదరాబాద్కు ఫార్ములా-ఈ పోటీలకు తిరిగి తీసుకొచ్చేందుకు చాలా వరకు ప్రయత్నాలు చేశాం. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఫార్ములా-ఈ నిర్వహణకు అవకాశం లేకపోవడం నిరాశ కల్గించింది.
-అక్బర్ ఇబ్రహీం, ఎఫ్ఎమ్ఎస్సీఐ అధ్యక్షుడు
‘గతేడాది విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా-ఈ చాంపియన్షిప్ను తిరిగి కొనసాగించడంలో విఫలమయ్యాం. రేసింగ్తో ఈ ప్రాంతానికి దాదాపు రూ.650 కోట్ల ఆదాయాన్ని సమకూర్చాం. దీనికి తోడు భారత ప్రధాన భాగస్వాములైన మహీంద్రా, టాటా కమ్యూనికేషన్స్ను నిరాశపరిచాం. హైదరాబాద్ రేసింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఆవశ్యకతను పెంపొందిచేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ఇంధన వాహనాలతో ప్రజల ఆరోగ్యంతో పాటు వాతావరణం దెబ్బ తింటున్నది.
-జెఫ్ డాడ్స్, ఫార్ములా-ఈ సీఈవో