MSK Prasad : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత జట్టు ఓటమి రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీపై పలు ప్రశ్నల్ని లేవనెత్తింది. అతడిని సారథిగా తప్పించాలనే వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా టీమిండియా టెస్టు కెప్టెన్సీపై మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) సంచలన కామెంట్స్ చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohi,)కి మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మంచిదని, అలా చేయడంలో తప్పేమీ లేదని అన్నాడు. భారత సెలెక్టర్లు రోహిత్ శర్మ స్థానంలో కొత్త కెప్టెన్ కోసం చూస్తున్నట్లయితే కోహ్లీ ఉండనే ఉన్నాడని అతను తెలిపాడు.
‘విరాట్ కోహ్లీని ఎందుకు టెస్టు కెప్టెన్ చేయకూడదు? ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో జట్టులోకి వచ్చిన అజింక్యా రహానే(Ajinkya Rahane) వైస్ కెప్టెన్ అయ్యాడు. అలాంటిది మాజీ కెప్టెన్ కోహ్లీ మళ్లీ టెస్టు పగ్గాలు చేపడితే తప్పేంటీ?’ అని ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశ్నించాడు.
కోహ్లీ కెప్టెన్సీలో వరల్డ్ నంబర్ 1 అయిన భారత జట్టు
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడింది. వాటిలో కేవలం నాలుగు మ్యాచుల్లోనే విజయం సాధించింది. అది కూడా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)లో. ఈ సిరీస్లో రెండు టెస్టులు నెగ్గిన భారత్ మూడో టెస్టు డ్రా చేసుకుంది. దాంతో, 2-1తో సిరీస్ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది.
మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) వారసుడిగా టెస్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ అద్భుత ఫలితాలు రాబట్టాడు. మైదానంలో హుషారుగా ఉండే కోహ్లీ జట్టుకు దూకుడు నేర్పాడు. అతడి కెప్టెన్సీలో భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై చిరస్మరణీయ విజయాలు సాధించింది. అంతేకాదు వరల్డ్ నంబర్ 1 (World No 1) జట్టుగా నిలిచింది. ఐసీసీ(ICC) 2021లో తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)కు చేరింది.
విరాట్ కోహ్లీ
అయితే.. అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో, విరాట్ నిరుడు జనవరి 15న టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో రోహిత్ శర్మ కొత్త సారథిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. తొలి టెస్టు జూలై 12 బార్బడాస్లో రెండో టెస్టు జూలై 20 పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరగనుంది.