BCCI Awards 2024: కరోనా కారణంగా మూడేండ్లుగా వాయిదా పడిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డుల వేడుక మళ్లీ తిరిగొచ్చింది. మంగళవారం హైదరాబాద్లోనే వేడుకను నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. భారత క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గాను టీమిండియా మాజీ ఆల్ రౌండర్, హెడ్కోచ్గా పనిచేసిన రవిశాస్త్రి ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది వన్డేలలో దుమ్ముదులిపిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఈయర్’ అవార్డు వరించినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది యువ క్రికెటర్లు కూడా అవార్డులను దక్కించుకున్నారు.
భారత జట్టు తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి.. టెస్టులలో 3,830 పరుగులు చేయగా వన్డేలలో 3,108 రన్స్ చేశాడు. రెడ్ బాల్ క్రికెట్లో 151 వికెట్లు తీసిన అతడు.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో 129 వికెట్లు పడగొట్టాడు. 2014 లో భారత క్రికెట్ జట్టుకు టీమ్ డైరెక్టర్గా ఉన్న శాస్త్రి.. 2016 తర్వాత పూర్తిస్థాయి కోచ్ బాధ్యతలు స్వీకరించాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్కు అగ్రెసివ్ ఆటతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలపై విజయాలు అందించాడు. శాస్త్రి హయాంలోనే భారత్.. ఆస్ట్రేలియాలో వరుసగా రెండుసార్లు టెస్టు సిరీస్లను సాధించింది. 2019 వన్డే వరల్డ్ కప్లో సెమీస్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ చేరింది. 2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ తర్వాత శాస్త్రి కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Ravi Shastri to receive BCCI’s lifetime achievement award tomorrow. [Express Sports]
– Winners of the last 4 years will be given their awards. pic.twitter.com/7o4Zax76RQ
— Johns. (@CricCrazyJohns) January 22, 2024
ఇక శుభ్మన్ గిల్ విషయానికొస్తే.. 2023 జనవరిలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగిన (జనవరిలో) ఈ పంజాబ్ యువ సంచలనం 29 వన్డేలలో 1584 పరుగులు చేశాడు. ఇందులో 9 అర్థ సెంచరీలు, 5 శతకాలున్నాయి. అత్యధిక స్కోరు 208. మూడు ఫార్మాట్లలో కలిసి అతడు 2 వేలకు పైగా పరుగులు సాధించాడు.
దేశవాళీ కుర్రాళ్లకూ..
దేశవాళీలో గత రెండు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న ముంబై యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్తో పాటు అదే జట్టుకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములానీలకు మాధవరావు సింధియా అవార్డుకు ఎంపికయ్యారు. 2022 రంజీ ఎడిషన్లో సర్ఫరాజ్ 982 పరుగులు చేయగా ములానీ 45 వికెట్లు పడగొట్టాడు.
అవార్డుల వేడుక లైవ్ ఇలా..
2019 తర్వాత బీసీసీఐ నిర్వహించబోతున్న ఈ అవార్డుల వేడుక హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు మొదలవనుంది. ఇండియా – ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగబోయే తొలి టెస్టు కోసం ఇదివరకే భాగ్యనగరానికి చేరుకున్న భారత, ఇంగ్లండ్ క్రికెటర్లు ఈ అవార్డుకు హాజరుకానున్నారు. ఈ వేడుకను జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది.