ఖమ్మం, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా రైతుల వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టుకు ఆయువుపట్టుగా ఉన్న గోదావరి నదిని కేంద్రంలోని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాష్ర్టానికి చెందిన బీజేపీ కేంద్రమంత్రి కిషన్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకుండా చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దద్దమ్మలు మనకెందుకని ప్రశ్నించారు. 38 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును ఎడారిని చేసే విధంగా ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీటిని తమిళనాడుకు తీసుకెళ్లేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాత్రి బస్సుయాత్ర ద్వారా ఖమ్మం వచ్చిన కేసీఆర్.. ఇక్కడి అంబేద్కర్ సెంటర్లో అశేష ప్రజావాహిని మధ్య ప్రసంగించారు. గతంలోనూ మోదీ ఇదే తరహా ప్రతిపాదన తెచ్చారని, తన తల తెగిపడినా ఒప్పుకోనని కరాఖండీగా చెప్పానని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ పని అయిపోయిందని, 250 సీట్లు కూడా ఆ పార్టీకి రావని అన్నారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలువబోతోందని స్పష్టం చేశారు. కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని, ఈ సమయంలో ఖమ్మంలో నామా నాగేశ్వరరావును గెలిపించుకుంటే కేంద్ర మంత్రి అవుతారని, జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనలో నిజమైన సంక్షేమం పేదలకు అందిందని గుర్తుచేశారు. అంతకుమించిన సంక్షేమం బీఆర్ఎస్ పాలనలోనే అందిందని జ్ఞప్తికి తెచ్చారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ తస్సుమన్నదని, రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని అన్నారు. కానీ రైతులకు సైతం చెప్పులున్నాయనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు విస్మరించారని అన్నారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కేవలం ఒట్టి విక్రమార్కేనని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరికోతలుంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు దాపురించాయని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పోరు చేసిన కేసీఆర్ను భయపెట్టడం ఎవరితరమూ కాదని స్పష్టం చేశారు. ‘జైళ్లకు తాను భయపడితే తెలంగాణ వచ్చేదా?’ అంటూ ప్రజలను అడిగారు. కాంగ్రెస్ పాలకులకు సోయి లేకపోవడం వల్లనే తాగు, సాగునీటి కష్టాలు దాపురించాయని అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 495 అడుగుల నీళ్లున్నప్పుడే జిల్లా రైతాంగాన్ని కాపాడామని, మండు వేసవిలో పాలేరులో మత్తడి దుంకించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. ఇప్పుడు సాగర్లో 510 అడుగుల నీళ్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర మాజీ మంత్రి అజయ్కుమార్ నాయకత్వంలో ఖమ్మం లకారం చెరువును బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి, పక్క జిల్లాలో నీటిపారుదలశాఖ మంత్రి ఉన్నా గుక్కెడు నీళ్లు కరువయ్యాయని ఆరోపించారు. ఖమ్మం, కొత్తగూడెంలో మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల మెడలు వంచేందుకు, వారితో యుద్ధం చేసేందుకు ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లేనని, కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైందో ప్రజలు ఇప్పటికే చూశారని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అద్భుత ఫలితాలు రానున్నాయన్నారు. ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, మదన్లాల్, హరిప్రియ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, జననేత రోడ్షోకు అశేష ప్రజావాహిని హాజరుకావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది.