మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం ప్రవాహంలా దండుకట్టి తరలొచ్చింది. తమ ప్రియతమ నేతను కళ్లారా చూసేందుకు.. ఆయన ప్రసంగం వినేందుకు జాతరలా బయలుదేరింది. ఖమ్మం గుమ్మం గులాబీ వనమైంది. సోమవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా మరిపెడ నుంచి ఖమ్మం జిల్లా శివారుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేరుకున్నదే తడవుగా గులాబీ దళం గుబాళింపుతో పులకించిపోయింది. సంప్రదాయ దుస్తులు ధరించి గిరిజన మహిళల నృత్యాలు.. మహిళలు బతుకమ్మలు, బోనాలతో కోలాటాలు వేస్తూ యాత్ర అగ్రభాగాన నడవగా.. మేళతాళాల నడుమ.. పూలు చల్లుతూ..
మహిళలు హారతులు పడుతూ తమ అభిమాన నేత కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికారు. ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’, ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ..’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జనం నినదిస్తూ బస్సు యాత్రను అనుసరించారు. నగరంలోని కాల్వొడ్డు నుంచి జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్ మీదుగా జడ్పీ సెంటర్ వరకు కిలోమీటర్ల కొద్దీ యాత్ర కొనసాగింది. ఇసుకేస్తే రాలనంత జనాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలు ఈలలు, చప్పట్లతో అధినేత ప్రసంగానికి మద్దతు పలికారు. ‘బీఆర్ఎస్కు బలమివ్వాలి.. ఎంపీగా నామాను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. అశేషంగా తరలివచ్చిన జన ప్రవాహంతో కేసీఆర్ రోడ్ షో సూపర్ సక్సెస్ అయ్యింది.