కోల్కతా: స్వదేశంలో పరుగులు చేయకుంటే ఎంతటి ఆటగాడికైనా విమర్శలు తప్పవని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. కెఎల్ రాహుల్కు కష్టకాలం నడుస్తున్నదని, అతడు తన ప్రతిభకు తగ్గ ప్రదర్శన చేయడం లేదని విశ్లేషించాడు. గత పది టెస్టుల్లో రాహుల్ ఒక్కసారి కూడా 25 పరుగుల మార్క్ దాటలేకపోయాడు.
47 టెస్టులు ఆడిన రాహుల్ 35 సగటు కూడా నమోదు చేయకపోవడం విచారకరమన్నాడు. గతంలో పలువురు ఆటగాళ్లు ఇటువంటి స్థితిని ఎదుర్కొన్నారన్నాడు. ఈ స్థాయికి చేరుకున్న తరువాత ఆటగాళ్లపై భారీ అంచనాలతోపాటు ఒత్తిడి కూడా ఉంటుందని, ఆటగాడు ఏం సాధించాడన్న దానినే అందరూ గుర్తిస్తారన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో రాహుల్ కొన్ని అసాధరణ ఇన్నింగ్స్ ఆడినా భారత్లో ఎలా ఆడాడన్నదానినే అభిమానులు గుర్తుంచుకుంటారన్నాడు.