Virat Kohli: భారత క్రికెట్ జట్టులో పరుగుల యంత్రంగా పిలుచుకునే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ టెస్టు క్రికెట్ కెరీర్లో తొలిసారి ఓ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 2011లో టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. ఇన్నేళ్ల ఈ ప్రయాణంలో ఒక సిరీస్ మొత్తానికి దూరమవడం ఇదే ప్రథమం. ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ.. తాజాగా మిగిలిన మూడు టెస్టులకూ సెలక్షన్కు అందుబాటులో లేడన్న విషయం తెలిసిందే. 13 ఏండ్లలో ఫిట్నెస్, ఫామ్ లేమి వంటి కారణాలేమీ కోహ్లీని అడ్డుకోకపోయినా తొలిసారి ఓ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
2011లో టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఇప్పటిదాకా కోహ్లీ టెస్టులలో 113 టెస్టులు ఆడాడు. స్వదేశంలో 2011 నుంచి 2023 దాకా అతడు మూడు టెస్టులు మాత్రమే మిస్ అయ్యాడు. 2017లో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు, 2018లో అఫ్గానిస్తాన్తో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు, 2021లో న్యూజిలాండ్తో కాన్పూర్ టెస్టులో మాత్రమే ఆడలేదు. కానీ తాజాగా సిరీస్ మొత్తానికి దూరంగా ఉన్నాడు.
Virat Kohli will miss an entire series for the first time in his 13 year old Test career. pic.twitter.com/domo84E9JB
— Johns. (@CricCrazyJohns) February 10, 2024
అరంగేట్రం నుంచి ఈ 13 ఏండ్లలో భారత్ ఆడిన మొత్తం టెస్టులలో కోహ్లీ మొత్తంగా (స్వదేశం, విదేశాల్లో) మిస్ అయిన టెస్టులు కూడా 13 మాత్రమే. స్వదేశంలో మూడు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. విదేశాల్లో పది మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇవి కూడా సిరీస్ మొత్తానికి దూరమైనవి కావు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2020-21లో భాగంగా అనుష్క.. వామికకు జన్మనివ్వడంతో ఆస్ట్రేలియా నుంచి తిరుగుపయనమయ్యాడు. 2022లో భారత జట్టు సౌతాఫ్రికా టూర్లో ఉండగా రెండో టెస్టులో ఆడలేదు.