ముంబై: భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్ఠాత్మక మహిళల ఫిఫా అండర్-17 ప్రపంచకప్ టోర్నీకి వేదికలు ఖరారయ్యాయి. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా).. భువనేశ్వర్, గోవా, నేవి ముంబైని వేదికలుగా ప్రకటిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 11 నుంచి 30 వరకు మెగాటోర్నీ జరుగుతుందని పేర్కొంది. ఫిఫా, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్), లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ(ఎల్వోసీ) సుదీర్ఘ సమీక్ష తర్వాత ఈ వేదికలను ఎంపిక చేశాయి. అయితే జ్యూరిచ్లో జూన్ 24వ తేదీన టోర్నీకి సంబంధించిన డ్రా వెలువడుతుందని తెలిపింది. ఈ మెగాటోర్నీలో మొత్తం 16 జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో ఆతిథ్య భారత్ సహా బ్రెజిల్, చిలీ, చైనా, కొలంబియా, జపాన్, న్యూజిలాండ్ ఇప్పటికే బెర్తు దక్కించుకోగా, మిగతా స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి 2020లో జరుగాల్సిన ఈ మెగాటోర్నీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా రెండేండ్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.