Siraj | న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ మరోమారు కలకలం రేపింది. శ్రీలంక, న్యూజిలాండ్పై వరుస సిరీస్ విజయాలతో దూకుడుమీదున్న టీమ్ఇండియాకు సంబంధించి అంతర్గత సమాచారం కావాలంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి యువ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ను సంప్రదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధ యూనిట్(ఏసీయు) దృష్టికి సిరాజ్ తీసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన ఏసీయు జరిగిన ఉదంతం ఆరా తీసింది.
బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని డబ్బులు కోల్పోయిన హైదరాబాద్కు చెందిన ఒక డ్రైవర్ టీమ్ఇండియా సమాచారం కోసం సిరాజ్ను సంప్రదించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. జట్టులో ఏం జరుగుతుందో చెప్పాలంటూ సిరాజ్కు సదరు వ్యక్తికి వాట్సాప్లో మెస్సెజ్ పెట్టినట్లు తెలిసింది. బోర్డు అధికారుల సమాచారం మేరకు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం చోటు చేసుకున్న తర్వాత బీసీసీఐ సీరియస్గా వ్యవహరిస్తున్నది. ఐపీఎల్లో ప్రతీ జట్టుతో ఒక ఏసీయు అధికారిని నియమించారు.