Sarandeep Singh : మరో వారం రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) మొదలుకానుంది. భారత్, ఆస్ట్రేలియా జట్టు టెస్ట గద కోసం తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టు వికెట్ కీపర్గా రాణిస్తున్న తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్(Srikar Bharat)కు మాజీ సెలెక్టర్ సరందీప్ సింగ్(Sarandeep Singh ) మద్దతు తెలిపాడు. ప్రస్తుతం ఉన్నవాళ్లలో టెస్టు ఫార్మాట్కు సరిపోయే వికెట్ కీపర్ భరతేనని అతను అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్(Ishan Kishan) బదులు అతడినే ఆడించాలని ఈ మాజీ సెలెక్టర్ అన్నాడు. అందుకు కారణం కూడా వెల్లడించాడు.
‘ఇషాన్ కిషన్ ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ ఆడలేదు. అతడు విధ్వంసక ఆటగాడే. కానీ ఏమంత అనుభవం లేని అతడికంటే భరత్ ఎంపిక సరైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై భరత్ ఆకట్టుకున్నాడు. మరిన్ని అవకాశాలు వస్తే అతడు అద్భుతంగా రాణిస్తాడు. ఇషాన్ ఒక ఓపెనర్. వన్డేలు, టీ20ల్లో ఇరగదీస్తున్నాడు. అలాగని అతడు టెస్టుల్లో సత్తా చాటడని నేను అనడం లేదు. అతడు భారత జట్టు ఆశాకిరణం. అయితే.. ఆరో స్థానంలో అదీ టెస్టు క్రికెట్లో బరిలోకి దిగడం అంత సులువు కాదు’ అనిసరందీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
మాజీ సెలక్టర్ సరందీప్ సింగ్
డబ్ల్యూటీసీలో భారత జట్టు ఎంపికపై కూడా సరందీప్ సింగ్ అన అభిప్రాయం తెలియజేశాడు. పదహారో సీజన్ ఐపీఎల్లో చెలరేగిన షమీ, సిరాజ్ ఫైనల్లో కీలకం కానున్నారు. అయితే.. వీళ్లతో పాటు బౌలింగ్ భారం మోసేందుకు ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ బదులు ఉమేశ్ యాదవ్(Umesh Yadav)కు తుది జట్టులో చోటు కల్పించాలని తెలిపాడు. ‘ఉమేశ్ పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టగలడు. ఓవల్ మైదానంలో అతను టీమిండియాకు ఎంతో పనికొస్తాడు’ అని సరందీప్ అన్నాడు. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడయం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్నాయి. 2021లో ఫైనల్ చేరిన టీమిండియా అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.