Kevin Pietersen : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) 16వ సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) మాత్రం అభిమానలను నిరాశ పరిచింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) సెంచరీ (101 నాటౌట్) బాదినా కూడా బౌలర్లు విఫలమవ్వడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో, ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాలనుకున్న కోహ్లీ కల చెదిరింది. ప్లే ఆఫ్స్ మెట్టుపై ఆర్సీబీ తడబడడంతో విరాట్ భవితవ్యంపై ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఛేజ్ మాస్టర్ కోహ్లీ ఆర్సీబీ ఫ్రాంఛైజీని వీడాల్సిన సమయం వచ్చిందని అతను అన్నాడు. అంతేకాదు అతను ఢిల్లీ జట్టుకు ఆడాలని కూడా సూచించాడు. ‘కింగ్ కోహ్లీ బెంగళూరుకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. అతడు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాలి’ అని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. అయితే.. కోహ్లీ ఇప్పటికే పలుమార్లు తాను బెంగళూరు జట్టను వీడే ప్రస్తకి లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. పీటర్సన్ వ్యాఖ్యలపై రికార్డుల రారాజు ఎలా స్పందిస్తాడో చూడాలి.
గుజరాత్పై సెంచరీ బాదిన కోహ్లీ (101 నాటౌట్)
రన్ మెషిన్ కోహ్లీ ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. మూడు సార్లు ఫైనల్ చేరినప్పటికీ ట్రోఫీ చేజారింది. 2009, 2011, 2016లో కోహ్లీ సేన రన్నరప్గా నిలిచింది. 15వ సీజన్లో కోహ్లీ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో, బెంగళూరు యాజమాన్యం ఫాఫ్ డూప్లెసిస్ సారథ్య బాధ్యతలు అప్పగించింది. పదహారో సీజన్లో ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ చేరకపోవడానికి కారణం మిడిలార్డర్ విఫలం కావడమే. ఆ జట్టు ఎక్కువగా కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ మీదనే ఆధారపడింది. ఈ ముగ్గురి తర్వాత హాఫ్ సెంచరీ కొట్టింది మహిపాల్ లొమ్రోర్ మాత్రమే. బౌలర్లలో సిరాజ్ తప్ప మిగతా వాళ్లెవరూ పెద్దగా రాణించలేదు.
పదహారో సీజన్ను బెంగళూరు జట్టు విజయంతో ప్రారంభించింది. ఆ తర్వాత తడబడినా ఆఖరి దశలో పుంజుకుంది. మెరుపు బ్యాటింగ్తో జట్టుకు విజయాలు అందించారు. కీలకమైన పోరులో సన్రైజర్స్ హైదరాబాద్పై విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో, 14 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ పోటీలో నిలిచింది. ఆఖరి లీగ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇక బెంగళూరు కథ ముగిసినట్టే అనుకున్నారంతా. కానీ, వర్షం తగ్గడంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్పై కోహ్లీ(101 నాటౌట్) శతకంతో మెరిశాడు. 198 పరుగుల లక్ష్య ఛేదనలో శుభ్మన్ గిల్(104) సెంచరీ కొట్టడంతో ఆర్సీబీకి ఘోర పరాభవం ఎదురైంది. ప్లే ఆఫ్స్కు ఒక్క అడుగు దూరంలో నిలిచి ఫ్యాన్స్ను నిరాశకు గురి చేసింది.