Josh Hazlewood : గత కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్(Josh Hazlewood ) ఫిట్నెస్ సాధించాడు. దాంతో, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC Final 2023) ఆడేందుకు అతడికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఆసీస్ జట్టును ప్రకటించింది. మరి ఈ స్టార్ బౌలర్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి. కాలి వేళ్ల గాయం కారణంగా ఐపీఎల్ 16వ సీజన్ నుంచి హేజిల్వుడ్ అర్ధంతరంగా స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే.
‘ఐపీఎల్ మధ్యలోంచి హేజిల్వుడ్ గతవారం స్వదేశానికి వచ్చాడు. కాలి వేళ్ల గాయంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తగినంత విశ్రాంతి తర్వాత అతను బౌలింగ్లో తన మునపటి వేగం అందుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్ కోసం అతను ప్రాక్టీస్ మొదలు పెట్టాడు’ అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ జెర్సీతో హేజిల్వుడ్
ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిడ్నీ టెస్టులో హేజిల్వుడ్ గాయపడ్డాడు. అషిల్లెస్ టెండిటైటిస్ కారణంగా అతను భారత పర్యటనకు వచ్చినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. స్వదేశంలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీల్ టీమిండియా 2-1తో ఆసీస్ను చిత్తు చేసింది. దాంతో, రికార్డు స్థాయిలో నాలుగోసారి ఈ ట్రోఫీని సాధించింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదికగా టెస్టు గద కోసం రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఫైనల్ ఫైట్ జరగనుంది. భారత జట్టు కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్ ఐపీఎల్ 16వ సీజన్లో సెంచరీలు బాది ఫామ్ చాటుకున్నారు. సీనియర్ పేసర్ షమీ, సిరాజ్ పదునైన బంతులతో బ్యాటర్లకు వణుకుపుట్టిస్తున్నారు. దాంతో, రోహిత్ శర్మ సేన టెస్టు గదను సొంతం చేసుకొనేందుకు ఈసారి మంచి అవకాశం ఉంది. 2021-22లో ఫైనల్ చేరిన టీమిండియా అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.