బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ (GT) టీమ్తో జరిగిన ఐపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోహ్లీ 101 పరుగులు రాబట్టడం ద్వారా 8వ సెంచరీ నమోదుచేసి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్గా మరో ముగ్గురు బ్యాటర్లతో కలిసి స్థానాన్ని పంచుకున్నాడు. ఇప్పటిదాకా 7 సెంచరీలతో తనతో సమంగా ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ ల్యూక్ రైట్ను అధిగమించాడు.
టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డు ప్రస్తుతం వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్నది. గేల్ టీ20 ఫార్మాట్లో మొత్తం 22 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత 9 సెంచరీలతో పాకిస్థాన్ స్కిప్పర్ బాబా అజాం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లు మైఖేల్ క్లింగర్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్లు ఎనిమిదేసి సెంచరీలు చేసి మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వారికి జతచేరాడు.
కాగా, తాజా ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ మొత్తం 14 మ్యాచ్లు ఆడి 139 స్ట్రైక్ రేట్, 53.25 సగటుతో 639 పరుగులు పిండుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్గా రికార్డుల్లో నిలిచాడు. ఇక మొత్తం టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే కోహ్లీ ఇప్పటివరకు 374 మ్యాచ్లు ఆడి 11,965 పరుగులు చేశాడు. అందులో మొత్తం 8 సెంచరీలు ఉన్నాయి. వాటిలో 7 ఐపీఎల్ సెంచరీలు కాగా, ఒకటి అంతర్జాతీయ టీ20 సెంచరీ ఉన్నది.