ఇటీవల టీ20 ప్రపంచకప్ చేజిక్కించుకున్న ఇంగ్లండ్.. ఇంకా అదే జోష్లో కనిపిస్తున్నది. పాకిస్థాన్తో తొలి టెస్టులో ఇంగ్లిష్ టాపార్డర్ దంచికొట్టడంతో ప్రపంచ రికార్డు బద్దలైంది. సుదీర్ఘ చరిత్ర గల టెస్టు క్రికెట్లో తొలి రోజు అత్యధిక పరుగులు (506/4) చేసిన జట్టుగా స్టోక్స్ సేన చరిత్ర సృష్టించింది.
రావల్పిండి: పరిమిత ఓవర్ల క్రికెట్లో బాదుడే పరమావధిగా పెట్టుకున్న ఇంగ్లండ్.. టెస్టుల్లోనూ అదే ఫామ్ కొనసాగిస్తున్నది. పాకిస్థాన్తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ రికార్డులు తిరగరాసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లిష్ జట్టు.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్లో తొలి రోజు 500 పరుగులు చేసిన మొదటి జట్టుగా ఇంగ్లండ్ చరిత్రకెక్కింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (122), బెన్ డకెట్ (107), ఒలీ పోప్ (108), హ్యారీ బ్రూక్ (101) శతకాలతో వీరవిహారం చేశారు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు 75 ఓవర్లలోనే 6.74 రన్రేట్తో పరుగులు రాబట్టడం విశేషం. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ ప్లేయర్లు 73 ఫోర్లు, 3 సిక్సర్లు బాదడం గమనార్హం. వైరస్ బారిన పడిన ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్లో అసలు బరిలోకి దిగడమే కష్టమనిపించగా.. ఆట ప్రారంభానికి రెండు గంటల ముందు తుది జట్టును ఫైనల్ చేశారు. 17 ఏండ్ల తర్వాత పాకిస్థాన్లో పర్యటిస్తున్న ఇంగ్లండ్.. తమ పవర్ హిట్టింగ్తో పాక్ బౌలర్లను చెడుగుడాడు కోగా.. వెలుతురులేమి కారణంగా మ్యాచ్ను నిర్ణీత సమయం కంటే ముందే నిలిపివేశారు. పాక్ బౌలర్లలో జాహిద్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్రూక్స్తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ (34) క్రీజులో ఉన్నాడు.