లోకల్బాయ్ రవీంద్ర జడేజా రాజ్కోట్లో దుమ్మురేపాడు. తొలి ఇన్నింగ్స్లో శతక్కొట్టిన ఈ ఆల్రౌండర్.. రెండో ఇన్నింగ్స్లో పాంచ్ పటాకా మోగించాడు!
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో డబుల్ సెంచరీతో కదంతొక్కడంతో.. ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం నిలువగా.. దూకుడుగా ఆడుదామనుకున్న ఇంగ్లిష్ బ్యాటర్లతో మన స్పిన్నర్లు ఆటాడుకున్నారు!!
ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో టీమ్ఇండియా పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు సిరీస్లో 2-1తో ముందంజ వేసింది.
Ind Vs Eng Test | రాజ్కోట్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా.. టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి రెండు రోజులు నువ్వా నేనా అన్నట్లు సాగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. 557 పరుగుల లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 122 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో రోహిత్ సేన జయభేరి మోగించింది. బజ్బాల్ పేరిట సుదీర్ఘ ఫార్మాట్లో సైతం టీ20 తరహాలో ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్ల పప్పులు ఈ సారి ఉడకలేదు. బెన్ డకెట్ (4) రనౌట్తో ప్రారంభమైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. పదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన మార్క్ వుడ్ (33) టాప్ స్కోరర్ కాగా.. క్రాలీ (11), పోప్ (3), రూట్ (7), బెయిర్స్టో (4), స్టోక్స్ (15), ఫోక్స్ (16) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు ఖాతాలో వేసుకోగా.. కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 196/2తో నాలుగోరోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 430/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ప్రత్యర్థి ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. యశస్వి (236 బంతుల్లో 214 నాటౌట్; 14 ఫోర్లు, 12 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగగా.. శుభ్మన్ గిల్ (91; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. అస్వస్థత కారణంగా సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన యశస్వి.. ఆ తర్వాత క్రీజులో అడుగుపెట్టి వీర విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపుతూ సిక్సర్ల జడివాన కురిపించాడు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (12) కొట్టిన బ్యాటర్గా పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ సరసన నిలిచాడు. జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి రాంచీలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
1 టెస్టుల్లో పరుగుల తేడా పరంగా భారత్కు ఇదే (434 పరుగులతో) అతి పెద్ద విజయం. 2021లో న్యూజిలాండ్పై 372 పరుగుల తేడాతో విజయం రెండో స్థానానికి చేరింది.
1 టెస్టుల్లో తొలి మూడు శతకాలను 150 ప్లస్ స్కోర్లుగా మలిచిన తొలి భారత ప్లేయర్గా జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు.
1 ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (12) కొట్టిన ప్లేయర్గా జైస్వాల్.. పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ వసీం అక్రమ్ సరసన చేరాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 445;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319;
భారత్ రెండో ఇన్నింగ్స్: 430/4 డిక్లేర్డ్ (యశస్వి 214 నాటౌట్, గిల్ 91; హార్ట్లీ 1/78);
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 122 (వుడ్ 33; జడేజా 5/41, కుల్దీప్ 2/19).