కోల్కతా: వన్డే ప్రపంచకప్ నాకౌట్ రేసులో నిలువాలంటే భారీ తేడాతో గెలువాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ పూర్తిగా తడబడింది. మ్యాచ్ ఆరంభానికి ముందే.. టాస్ రూపంలో ఆశలు వదిలేసుకున్న పాక్.. ఆ తర్వాత మైదానంలో బౌలింగ్, బ్యాటింగ్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. శనివారం డబుల్ హెడర్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించగా.. తొమ్మిది మ్యాచ్ల్లో ఐదో పరాజయంతో పాక్ పట్టికలో ఐదో స్థానానికే పరిమితమైంది.
మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (84; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. జో రూట్ (60), బెయిర్స్టో (59) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో రవుఫ్ 3.. షాహీన్, వసీమ్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. భారీ లక్ష్యాన్ని 6.4 ఓవర్లలో ఛేదిస్తే.. నెట్ రన్రేట్లో న్యూజిలాండ్ను దాటి ముందంజ వేసే అవకాశం ఉండగా.. పాక్ 43.3 ఓవర్లలో 244 పరుగులకు కుప్పకూలింది. ఆగా సల్మాన్ (51) అర్ధశతకం సాధించగా.. షఫీఖ్ (0), ఫఖర్ జమాన్ (1), ఇఫ్తిఖార్ (3), షాదాబ్ (4) విఫలమయ్యారు. కెప్టెన్ బాబర్ (38), రిజ్వాన్ (36), రవుఫ్ (35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’విల్లీ 3 వికెట్లు పడగొట్టాడు.