వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. హ్యారీ బ్రూక్ (186), జో రూట్ (153 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. లాథమ్ (35) టాప్ స్కోరర్ కాగా.. తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు.
అండర్సన్ (3/37), లీచ్ (3/45) ధాటికి కాన్వే (0), విలియమ్సన్ (4), విల్ యాంగ్ (2), మిషెల్ (13), నికోల్స్ (30), బ్రాస్వెల్ (6) పెవిలియన్కు క్యూ కట్టారు. చేతిలో మూడు వికెట్లు ఉన్న న్యూజిలాండ్.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 297 పరుగుల దూరంలో ఉంది. బ్లండెల్ (25), కెప్టెన్ సౌథీ (23) క్రీజులో ఉన్నారు.