దుబాయ్: ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ( ICC player of the month ) అవార్డులను సోమవారం ప్రకటించింది. మెన్స్, వుమెన్స్ క్రికెట్లో ఆగస్ట్ నెలకుగాను అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఈ అవార్డులు వరించాయి. మెన్స్ క్రికెట్లో ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్ జో రూట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికయ్యాడు.
బుమ్రాను వెనక్కి నెట్టి..
ఈ అవార్డు రేసులో రూట్తోపాటు టీమిండియా పేస్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిది కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి రూట్ అవార్డు గెలుచుకున్నాడు. ఇండియాతో జరిగిన నాలుగు టెస్టుల్లో రూట్ ఏకంగా 3 సెంచరీలు బాదాడు. మొత్తంగా 94 సగటుతో 564 పరుగులు చేశాడు. అటు బుమ్రా కూడా ఈ సిరీస్లో 18 వికెట్లతో రాణించాడు. ఇక పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది.. వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్లో 18 వికెట్లు తీశాడు.
అయితే కెప్టెన్గా రూట్పై అదనపు ఒత్తిడి ఉన్నదని, అతనిపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయని ఐసీసీ ఓటింగ్ ప్యానెల్ సభ్యుడు, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని అన్నాడు. అతను బ్యాట్తో రాణించిన విధానం అద్భుతమని కొనియాడాడు. అటు వుమెన్స్ క్రికెట్లో ఆగస్ట్ నెలకుగాను ప్లేయర్ ఆఫ్ ద మంత్గా అమీర్ రిచర్డ్సన్ నిలిచింది. ఐర్లాండ్కు చెందిన ఆమె.. టీ20 వరల్డ్కప్ యూరప్ క్వాలిఫయర్లో అద్భుతంగా రాణించింది. ఈ టోర్నీలో ఆమె 7 వికెట్లు తీసింది.