ECB withdraw Pak Tour | న్యూజిలాండ్ తర్వాత పాకిస్థాన్లో పర్యటన నుంచి ఇంగ్లండ్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లు వెనక్కు తగ్గాయి. పాకిస్థాన్లో భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ తమ జట్లను పంపలేమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) సోమవారం ప్రకటించింది. తమ ఆటగాళ్ల భౌతిక, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. న్యూజిలాండ్ నిర్ణయం తీసుకున్న మూడు రోజులకే ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అక్టోబర్ 13, 14 తేదీల్లో రెండు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడేందుకు ఈసీబీతో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒప్పందం కుదుర్చుకుంది. అదే నెల 17-21 మధ్య మహిళా జట్లు మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తమను నిరాశ పరిచిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా ట్వీట్ చేశారు. అయినప్పటికీ పాక్ టీం కోలుకుంటుందని వ్యాఖ్యానించారు.