న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్ తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఘోరం పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ మంగళవారం ధర్మశాలలో బంగ్లాదేశ్తో జరిగిన రెండో మ్యాచ్లో భారీ విజయం నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేయగా.. 365 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 137 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
కెప్టెన్ లిటన్ దాస్ మినహా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇంగ్లండ్ బౌలర్ రీస్ టోప్లీ బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచాడు. రెండో ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ తంజీద్ హసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే నజ్ముల్ హొసేన్ శాంటోను కూడా ఖాతా తెరవకుండానే టోప్లీ పెవిలియన్కు పంపాడు. అప్పటికి జట్టు స్కోర్ 14/2. ఆరో ఓవర్లో షకీబ్ ఉల్ హసన్ కూడా ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ కూడా సింగిల్ డిజిట్కే వెనుదిరిగాడు.
ఆ తర్వాత ముష్ఫికర్ రహీమ్ (51; 4 ఫోర్లు), టోవిడ్ హృదయ్ (39; 2 ఫోర్లు) పర్వాలేదనిపించారు. ఇక టెయిలెండర్లు కూడా తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దాంతో 48.2 ఓవర్లలో 227 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయ్యింది. రీస్ టోప్లీ 4 వికెట్లు, క్రిస్ వోక్స్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ ఓపెనర్లు జానీ బెయిర్స్టో, డేవిడ్ మలాన్ తమ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 115 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ దశలో షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్లో బెయిర్స్టో (52; 8 ఫోర్లు) క్లీన్ బౌల్డయ్యాడు.
తర్వాత జోయ్ రూట్ వన్ డౌన్గా వచ్చి డేవిడ్ మలాన్కు జత కలిశాడు. ఈ ఇద్దరు కూడా 151 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత మెహదీ హసన్ బౌలింగ్లో మరో సెంచరీ హీరో డేవిడ్ మలాన్ (140; 16 ఫోర్లు, 5 సిక్స్లు) బౌల్డ్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 266 పరుగులు. ఆ తర్వాత భారీ స్కోర్ నమోదు చేసే ప్రయత్నంలో బాదుడే పనిగా పెట్టుకుని ఇంగ్లండ్ బ్యాటర్లు వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు. జోయ్ రూట్ (68; 8 ఫోర్లు, 1 సిక్సర్) నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. షొరీఫుల్ ఇస్లామ్ బౌలింగ్లో ముష్ఫికర్ రహీమ్కు క్యాచ్ ఇచ్చి రూట్ ఔటయ్యాడు.