ENG vs PAK : ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య రావల్పిండిలో జరుగుతున్న మొదటి టెస్టులో రికార్డులు బద్ధలవుతున్నాయి. నలుగురు ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కడంతో టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేరోజు 500లకు పైగా పరుగులు చేసిన మొదటి జట్టుగా ఆవిర్భవించింది. 75వ ఓవర్లో జట్టు స్కోర్ 500 మార్క్ చేరింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరు మీద ఉంది. ఆసీస్ ఒకేరోజు 494-6 రన్స్ చేసింది. అయితే, వెలుతురు తగ్గిపోవడంతో మొదటి రోజో ఆటని 50 నిమిషాల ముందే నిలిపివేశారు. లేదంటే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఒకరోజులో 550 రన్స్ పైగా చేసి ఉండేది.
శతక్కొట్టిన నలుగురు
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ ఆకాశమే హద్దుగా ఆడారు. పాక్ బౌలర్లను డామినేట్ చేస్తూ ఇద్దరూ సెంచరీలు సాధించి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కీలక ఆటగాడు జో రూట్ 23 పరుగులకే వెనుదిరిగాడు. అతడి వికెట్ తీశామన్న ఆనందంలో ఉన్న పాక్ బౌలర్లకు ఎంతోసేపు నిలవలేదు. మిడిలార్డర్లో వచ్చిన ఓలీ పోప్(108), హ్యారీ బ్రూక్(101) కూడా శతకాలతో చెలరేగారు. దాంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 34 రన్స్, సెంచరీ హీరో బ్రూక్స్ 101 రన్స్తో నాటౌట్గా ఉన్నారు. పాక్ బౌలర్లలో జహిద్ మొహమ్మద్కు రెండు వికెట్లు పడగొట్టాడు. హ్యారిస్ రౌఫ్, మొహమ్మద్ అలీ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి పాక్ పేసర్లు రోజంతా మూడు మెయిడెన్ ఓవర్లు మాత్రమే వేయగలిగారు.
ఈ మ్యాచ్లోనే ఇంగ్లండ్ తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. 27 ఓవర్లలో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 174 రన్స్ చేసింది. దాంతో, గతంలో టీమిండియా (154 పరుగులు)పేరు మీదున్న రికార్డును బ్రేక్ చేసింది.